Raghurama Torture Case: వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. అప్పటి వైసీపీ నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టడీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడుతున్న సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై విచారణ వేగవంతమైంది. తాజాగా గుంటూరులోని సీసీఎస్ కార్యాలయంలో దర్యాప్తు అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. సుమారు ఐదు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.
విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం, ఇద్దరు వీఆర్వోల సమక్షంలో ఈ విచారణను నిర్వహించింది. మొత్తం విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసింది.
విచారణలో భాగంగా సునీల్ కుమార్కు పలు కీలక ప్రశ్నలను అధికారులు సంధించినట్లు సమాచారం. రఘురామకృష్ణరాజును కస్టడీలో శారీరకంగా హింసించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? కస్టడీ సమయంలో ముసుగులు ధరించి దాడి చేసిన వ్యక్తులు ఎవరు? ఈ మొత్తం ఘటనలో మీ పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలు విచారణలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. అంతేకాదు, అరెస్ట్ ప్రక్రియ, కస్టడీ నిర్వహణ, వైద్య పరీక్షల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించబడ్డాయన్న అంశంపైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సునీల్ కుమార్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు రికార్డుల్లో సమాధానాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కొన్ని అంశాలపై “నాకు తెలియదు” అని స్పష్టంగా చెప్పగా, మరికొన్నింటికి “అన్ని వివరాలు రికార్డుల్లో ఉంటాయి” అంటూ సమాధానం దాటవేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విచారణకు ఆయన పూర్తిస్థాయిలో సహకరించడం లేదన్న అభిప్రాయానికి దర్యాప్తు బృందం వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ను మరోసారి విచారణకు హాజరుకావాలంటూ.. నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే, ఆయన వాంగ్మూలాన్ని ఎదురెదురుగా ఇతర అధికారుల వాంగ్మూలాలతో పోల్చి చూసే దిశగా కూడా దర్యాప్తు సాగవచ్చని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం.. ముమ్మాటికీ దేశద్రోహపు చర్య!
రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసు అప్పట్లో మానవ హక్కుల ఉల్లంఘనగా.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పుడు ప్రభుత్వ మార్పు తర్వాత ఈ కేసులో దర్యాప్తు మళ్లీ ఊపందుకోవడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.