RK Roja: నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని మాజీ మంత్రి రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేసి చంద్రబాబు ఆప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని రోజా ధ్వజమెత్తారు. జగన్ కరువు నివారణకు కృషి చేస్తే, బాబు తన ఆస్తుల రక్షణ కోసం ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
అలాగే దేశంలోనే అట్టడుగు స్థానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా విమర్శించారు. కేంద్ర నివేదికను చూసి చంద్రబాబు, అనిత సిగ్గుపడాలన్నారు. పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ తానా అంటే పోలీసులు తందానా అంటున్నారని మండి పడ్డారు.
పోలీసు శాఖ ఖాకీ చొక్క తీసేసి పసుపు చొక్క వేసుకుందని ఆర్కే రోజా ఆరోపించారు. తమ హయాంలో తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడలేదని అన్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి ఇస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్రంలో గంజాయి వ్యాప్తి, మహిళలపై దాడులు, హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. నచ్చని వారిపై తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: మంటల్లో పచ్చని కోనసీమ! అసలు ఎలా జరిగింది.. పాయింట్ టు పాయింట్
రాష్ట్ర పరువును గంగపాలు చేశారని కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంపద అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. నేటితో 3 లక్షల కోట్లు అప్పులు చేశారని.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, సంక్షేమం జీరో అంటూ విమర్శలు గుప్పించారు.