Roja Angry: వైసీపీ రూటు మార్చిందా? కేసుల ప్రభావమో ఏమోగానీ అధినేత జగన్ దారిలో నేతలు వెళ్తున్నారా? నిన్న పేర్నినాని, నేడు రోజా.. రేపు ఇంకెవరు? చాన్నాళ్లుగా సైలెంట్ అయిన రోజా లైమ్లైట్లోకి రావడం వెనుక ఏం జరిగింది? పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
లిక్కర్ కుంభకోణంలో నాయకులు అరెస్టు కావడంతో వైసీపీ ఉలిక్కిపడింది. మీడియా ముందు ఆ కేసుల ప్రస్తావనకు రాకుండా ఆ పార్టీ నేతలు తమ నోటికి పదును పెట్టారు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టారు. జగన్ వార్నింగ్ తరహాలోనే వైసీపీ నేతలు టీడీపీ నాయకులపై పదునైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి పేర్నినాని అలాంటి వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. అరెస్టు కాకుండా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రోజా వంతైంది. నియోజకవర్గం సమస్యల నేపథ్యంలో నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్పై విరుచుకుపడ్డారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, చెవిరెడ్డికి ఏం సంబంధముందని కేసులు పెట్టి అరెస్టు చేశారని ప్రశ్నించారు.
వారు ఇచ్చినవన్నీ చక్రవడ్డీతో తిరిగి చెల్లిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విషయంలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు, తన విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారని మీడియా ముందు చిందులేశారు. మంత్రి లోకేష్.. ఎమ్మెల్యే భాను ప్రకాష్ ద్వారా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ALSO READ: ఏపీ లిక్కర్ కేసులో అరెస్టుల పర్వం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో చిక్కిన వరుణ్
అధికారం ఉందని ఎగిరెగిరి పడితే… వైసీసీ అధికారంలోకి రాగానే ఎగిరేసి తంతామంటూ ఘాటుగా హెచ్చరించారు. ఉన్నట్లుండి రోజా ఆ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల తర్వాత వైసీపీలో అంతర్గత కలహాల నేపథ్యంలో సైలెంట్ అయ్యారు రోజా.
అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని లిక్కర్ కేసులో అరెస్టు అయ్యారు. ఆ నేతలు లేని లోటును పూర్తి చేయాలని ఆలోచన చేసినట్టు ఆమె పడినట్టు ప్రత్యర్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీడియా ముందు నోరు పారేసుకుంటున్నారని అంటున్నారు.
నార్మల్గా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో రోజా కూడా ఒకరు. అధికారం పోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. నేతలు అరెస్టుతో మళ్లీ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రోజాకు కష్టాలు తప్పవని అంటున్నారు అధికార పార్టీ నేతలు. అప్పుడు ఆమెని ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఆడుకుంటారని అంటున్నారు. అధికార పార్టీపై విరుచుకుపడినట్టు ఉంటుంది.. పార్టీలో తన ఇమేజ్ చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి వన్ షాట్.. టూ బర్డ్స్ ఫార్ములాని రోజా ఫాలో అవుతున్నారన్నమాట.