Satish Kumar: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్వో) సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో.. రైల్వే పోలీసులు తిరుపతి రైల్వే స్టేషన్లో విచారణను వేగవంతం చేశారు. పరకామణి కేసు విచారణ నేపథ్యంలో ఈ నెల 14న రాయలసీమ ఎక్స్ప్రెస్ (12794) రైలులో బయలుదేరిన సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
రైల్వే ఉద్యోగులను ప్రశ్నిస్తున్న ప్రత్యేక బృందం
మృతుడు సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉదయం 6:26 నిమిషాలకు తిరుపతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో, రైలు ఎ-1 బోగీలో ప్రయాణించిన సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు చేసేందుకు రైల్వే డిఎస్పీ హర్షిణి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. తిరుపతి రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలులో డ్యూటీలో ఉన్న సీటీసీ (చీఫ్ ట్రైన్ క్లర్క్), లోకో పైలెట్లు, గార్డులు, టీసీ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్), బెడ్ రోల్, ఓబీహెచ్ఎస్ (ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్) సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
లగేజీ హ్యాండోవర్ పై డౌట్
విచారణలో భాగంగా, రైలులోని ఏ-1 కోచ్ బెడ్ రోల్ అటెండర్ రాజీవ్ రతన్ను, ఏ-2 కోచ్ అటెండర్ కృష్ణయ్యలను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ లగేజీని రాజీవ్ రతన్ హ్యాండోవర్ చేసినట్లు సమాచారం. రైలు తిరుపతి రైల్వే స్టేషన్ లోని యార్డులోకి వచ్చిన వెంటనే నమూనాలు (శాంపిల్స్) సేకరించారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నిన్న ఉదయం 8 గంటలకు రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది మృతుడి లగేజీ బ్యాగ్ను అప్పగించారు.
సీటు నెంబర్లపై విచారణ
లగేజీ బ్యాగ్ సీటు నెంబర్ 11లో లభించినట్లు రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్తుండగా, మృతుడు సతీష్ కుమార్ అసలు సీటు నెంబర్ 29. దీంతో, మృతుడు 29వ సీటు నుంచి 11వ సీటుకు ఎలా వచ్చాడు అనేదానిపై రైల్వే పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. పరకామణి కేసు విచారణకు వెళ్తున్న కీలక అధికారి అనుమానాస్పద మృతి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మృతి హత్యేనని బంధువులు ఆరోపిస్తుండటంతో.. కేసు దర్యాప్తులో అనేక కోణాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది.