KCR – KTR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్లో కీలక భేటీ అయ్యారు. ఇటీవల ముగిసిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం అదే రోజు మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లపై కవిత మెదక్లో చేసిన విమర్శల నేపథ్యంలో.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, వాటి ప్రభావంపై కేసీఆర్, కేటీఆర్ లోతైన సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS పార్టీకి ఎదురైన ఫలితంపై కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన కారణాలు, అంతర్గత లోపాలు, సంస్థాగత సమస్యలు, అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో పార్టీ తిరిగి పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, కేటీఆర్కు దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల BRS నుంచి సస్పెన్షన్కు గురైన కవిత.. హరీష్ రావు, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ కుటుంబ సభ్యులు కావడంతో, ఈ విమర్శలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. పార్టీపై, ముఖ్యంగా అగ్ర నాయకత్వంపై ఈ వ్యాఖ్యల ప్రతికూల ప్రభావాన్ని ఎలా అధిగమించాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్ల మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ ఏ విధంగా స్పందించాలి..? భవిష్యత్తులో అనుసరించాల్సిన వైఖరిపై కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం, అంతర్గత విబేధాలపై పార్టీ అధినేతతో వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ కావడం, BRS భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం కీలకంగా మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: Jubilee Hills: జూబ్లీలో నవీన్ యాదవ్ భారీ విజయం.. కాంగ్రెస్కు ఏ వార్డులో ఓట్లు ఎక్కువగా వచ్చాయంటే?