వైఎస్ షర్మిలకు ఉన్నట్టుండి తన అన్న జగన్ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.అందులో ఏపీకి చెందిన తెలుగు తమ్ముళ్లు ఉండగా, మరోవైపు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇంతకూ షర్మిల ఏం చేశారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె మీద అంతగా సెటైర్లు వేయడానికి కారణం ఏమై ఉంటుందని అటు నెటిజన్లు..ఇటు వైసీపీ శ్రేణులు తెగ వెతుకుతున్నారని టాక్. ఏపీ పీసీసీ చీఫ్గా ప్రస్తుతం కొనసాగుతున్న షర్మిల.. అక్కడి రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారని విమర్శలున్నాయి.
అటు ప్రజల్లో పార్టీకి ఆదరణ లేకపోవడంతో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలే లీడర్ అనిపించుకోవాలన్న కల ఆమెకు కలగానే మిగిలింది. అందుకే తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలా? అని ఆమె ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా ఆమె వైఎస్సార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ నేతలు సైతం షర్మిలను లైట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో అధికారంలోకి రావడం అసాధ్యం అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందుకే షర్మిల తన భవిష్యత్ గురించిన ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైఎస్ షర్మిల రాజకీయాల్లో ఇమడాలంటే ఒకటి జనాల్లో ఆదరణ ఉన్న పార్టీలోకి వెళ్లాలి. లేదంటే ప్రజలను మెప్పించేలా తన రాజకీయ ప్లాన్స్ ఉండాలి. రెండోది ఎలాగూ సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే తను బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి జనంలో ఆదరణ కరువైంది.అందుకే తను ఎక్కడ మొదలెట్టిందో అక్కడే తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఎలాగైనా తన అన్నకు దగ్గర అయ్యేందుకు తెరవెనుక కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు అవసరమైతే తన తల్లి సాయం తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ద్వారా వైఎస్సార్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఆమె స్కెచ్ వేసినట్టు టాక్ వినిపిస్తున్నది.ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో అఖండ పార్ట్-2 సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ, తెలంగాణ సీఎంకు చంద్రబాబు రాజకీయ గురువు అని అందరికీ తెలిసిందే. అందుకే చంద్రబాబు చెబితే రేవంత్ ఏదైనా చేస్తారు అనే టాపిక్ను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు చెప్పడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారని ఆమె ఆరోపించింది.మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కు వెళ్లడానికి చంద్రబాబే కారణమని, అక్కడి సీఎంతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. కాగా, షర్మిల వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. జగన్ మెప్పుకోసం సొంత పార్టీ సీఎంనే బ్లేమ్ చేస్తారా? అంటూ హస్తం శ్రేణులు మండిపడుతున్నారు.