Ayyanna Patrudu: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన స్పీకర్ల మహాసభలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అత్యున్నత స్థాయి చర్చకు తెరలేపారు.
విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ‘నో వర్క్ – నో పే’ నిబంధనను ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీకి రాకుండా, ఎమ్మెల్యేలు జీతభత్యాలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజా ధనాన్ని వృథా చేయడమేనని అభిప్రాయపడ్డారు.
సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరారు.ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి తగిన మార్గదర్శకాలు విడుదల చేయాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు.
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ‘నో వర్క్-నో పే’ ప్రతిపాదనకు లోక్సభ స్పీకర్తో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధుల నుండి ప్రాథమికంగా సానుకూల స్పందన లభించింది. అయ్యన్నపాత్రుడు చేసిన ఈ ప్రతిపాదనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతించారు. ఈ అంశం అత్యంత కీలకమైనదని, దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ ‘నో వర్క్-నో పే’ నిబంధన, ఎమ్మెల్యేల జవాబుదారీతనంపై తదుపరి నిర్వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. సభలు సజావుగా సాగడం, సభ్యుల హాజరు శాతం పెరగడం ప్రజాస్వామ్యానికి అవసరమని, సభ్యులు సభలో ఉండటం ద్వారానే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఓం బిర్లా అభిప్రాయపడ్డారు.
పలు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు సభకు సభ్యుల హాజరు తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సభ నిర్వహించే రోజుల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు.ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే క్రమశిక్షణా నియమావళిని ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేయడం ద్వారా సభల గౌరవాన్ని పెంచవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలలో ఎమ్మెల్యేల హాజరు, జీతభత్యాల విషయంలో ఒకే విధమైన నిబంధనలు ఉండాలని కొందరు ప్రతినిధులు సూచించారు.
Read Also: కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డ కవిత.. ‘పదేళ్లు గుర్తుకురాని జిల్లా.. ఇప్పుడు ఉద్యమాలా?’