RTC Bus Stuck on Track: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో ఒక భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మండలంలోని ఎస్ఎస్ గేట్ (SS Gate) సమీపంలో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ను దాటుతున్న సమయంలో ఒక ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా పట్టాల మీదనే ఆగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు భయాందోళనలకు గురైనప్పటికీ, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పి్ంది.
బస్సు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే పట్టాలు దాటుతున్న క్రమంలో బస్సు ఒక్కసారిగా మొరాయించడంతో డ్రైవర్ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాలేదు. పట్టాల మధ్యలో బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కిందికి దిగి పరుగులు తీశారు. బస్సు నిలిచిన సమయంలో ఆ మార్గంలో రైళ్లు ఏవీ రాకపోవడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. పట్టాలపై బస్సు ఉండటం వల్ల రైలు వస్తే పెను విధ్వంసం జరుగుతుందని గ్రహించి, అందరూ ఏకమై బస్సును నెట్టడం ప్రారంభించారు. స్థానిక యువకులు, ప్రయాణికులు కలిసి తమ శక్తిని ఒడ్డి బస్సును పట్టాల నుండి పక్కకు తొలగించగలిగారు. వారి సమయస్ఫూర్తికి, సాహసానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాధారణంగా రైల్వే గేట్ల వద్ద వాహనాలు ఆగిపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల బస్సు కదలకుండా పోవడంతో డ్రైవర్, కండక్టర్ కూడా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే, రైల్వే సిబ్బందికి సమాచారం అందేలోపే స్థానికుల సహాయంతో బస్సును సురక్షిత ప్రాంతానికి చేర్చడంతో పెను విపత్తు అగిపోయింది.
Also Read: సారీ అమ్మా.. నీ కంటే ముందే వెళ్తున్నా, కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి ఆఖరి లేఖ!
ఈ ఘటనతోనైనా రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాతబడిన బస్సులు లేదా ఇంజిన్ సమస్యలు ఉన్న వాహనాలను నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, సరైన సమయంలో రైలు రాకపోవడం, స్థానికుల చొరవ వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.