మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది.2019 ఎన్నికల ముందు ఆయన సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన కూతురు వైఎస్ సునీత నాటి నుంచి తన తండ్రి హత్యకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోరాడుతూనే ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఉదంతంపై సీబీఐ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. నాటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉన్నది. పలువురిని ఈ కేసులో సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. అయినప్పటికీ నిందితులు ఎవరో నేటికీ తెలియరాలేదు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనుమానం ఉన్న వ్యక్తుల వివరాలు ఇచ్చినా సీబీఐ విచారణ సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోలేదని.. కేవలం పాక్షిక విచారణ జరిపిందని సునీత ప్రధాన ఆరోపణ.. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీబీఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనే సుప్రీంను ఆమె ఆశ్రయించగా.. ముందుగా సీబీఐ ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.ఈ మేరకు ముందుగా ఆమె ట్రయల్ కోర్టులోనే వాదనలు వినిపించారు.ఇక్కడ తనకు న్యాయం దక్కేలా లేదని భావించిన ఆమె మరోసారి సుప్రీం గడప తొక్కారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మీరు కోరుతున్నారని సునీతను ప్రశ్నించారు.
ఆ తర్వాత సీబీఐ అధికారులను సుప్రీం ప్రశ్నించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఇంకెంత కాలం సాగదీస్తారు? పూర్తి విచారణ జరిపి నిందితులను గుర్తించడానికి ఇంకెంత కాలం టైం పడుతుందని ప్రశ్నించింది. ఈ విషయంపై త్వరగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని కోరింది. ఇదిలాఉండగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వైఎస్ జగన్ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆయనే ఎన్నికల సమయంలో ఆస్తి తగాదాల్లో భాగంగా తన సొంత బాబాయిని హత్య చేయించారని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.ఇదే కేసు విషయంలో మొన్నటివరకు మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచాయించారు.
తాజాగా సుప్రీంకోర్టు మరోసారి ఇన్వాల్వ్ అవ్వడంతో సీబీఐ అధికారులు విచారణలో వేగం పెంచనున్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే సునీత పేర్కొన్న విధంగా ఆమె అభిప్రాయాల మేరకు తన తండ్రి హత్య వెనుక ఎవరెవరి హస్తం ఉందని ఆమె చెబుతుందో వారిని సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే జగన్ను సైతం సీబీఐ విచారించే చాన్స్ లేకపోలేదని తెలుస్తున్నది. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితులు ఇప్పుడు ప్రాణాలతో లేరు. కొందరు కనిపించకుండాపోయారు. ఇటువంటి సమయంలో జగన్ పాత్ర ఉందని తెలిస్తే ఆయనకు శిక్ష తప్పదని, కీలక నిందితులను కూడా జగన్ అంతమొందించారని తెలుగు తమ్ముల్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సుప్రీం తీర్పుతో జగన్కు భయం పట్టుకున్నదని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.