దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం వివిధ అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చలు సఫలమై, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి.
ప్రపంచ ప్రసిద్ధ బ్యూటీ బ్రాండ్ ‘లోరియల్’ (L’Oreal) తన మొట్టమొదటి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోరియల్ సీఈఓ నికోలస్ హియోరోనిమస్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్లో ప్రారంభం కానున్న ఈ కేంద్రం ద్వారా ఏఐ, అనలిటిక్స్, సప్లై చైన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో వినూత్న పరిష్కారాలను లోరియల్ ప్రపంచవ్యాప్త యూనిట్లకు అందించనుంది. ఇది హైదరాబాద్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మరింత పటిష్టం చేయనుంది.
కాలిఫోర్నియాకు చెందిన ‘బ్లైజ్’ (Blaze) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తక్కువ శక్తిని వినియోగించే ఏఐ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఈ సంస్థ కీలకం. వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంలో భాగంగా, ఏఐ డేటా సెంటర్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్లోవాకియాకు చెందిన ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ తెలంగాణలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR) ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచింది. సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించనుంది. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ సుస్థిర ఇంధన ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
అమెరికాకు చెందిన సర్గడ్ (Sargad) సంస్థ రాబోయే ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో విమానాల నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వరంగల్ లేదా ఆదిలాబాద్ విమానాశ్రయాల్లో ఈ కేంద్రాన్ని నెలకొల్పాలని సీఎం సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.