Peddareddy House Arrest: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇరువురు నేతల నివాసాలకు మధ్యలో ఉండే కాలేజీ గ్రౌండ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నిల్వ ఉంచిన రాళ్ల డంపులను పోలీసులు తొలిగించారు. ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరు పక్షాల ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరించారు.
నిన్న జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో ఉండగా.. అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయనను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుని.. అవసరమైతే అనంతపురానికి తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలకు మాత్రమే పరిమితంగా అనుమతులు ఇచ్చారు.
తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటానని పెద్దారెడ్డి చెబుతున్నా, పోలీసులు మాత్రం పట్టువిడవడం లేదు. ఆయన పట్టణంలోకి ప్రవేశిస్తే రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అటు తిమ్మంపల్లిలోనూ, ఇటు తాడిపత్రిలోనూ వందలాది మంది పోలీసులతో పహారా కాస్తున్నారు.
ALSO READ: మళ్లీ పాదయాత్ర బాటలో జగన్.. 2029 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్!