Kolikapudi Warning: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉందో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పల్లా శ్రీనివాసరావు గట్టి హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఈ భేటీ నిర్వహించి కొలికిపూడికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.
ఈ సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.‘పార్టీ ఉంటేనే నాయకులు ఉంటారు.. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా జీరో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఆయన కొలికిపూడికి హితవు పలికారు. ఇటీవల కొలికిపూడి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యంగా కొలికిపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్లలో పెడుతున్న కొన్ని పోస్టులపై పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాట్సాప్లో పిచ్చి పిచ్చి స్టేటస్లు పెడుతూ అసలు ఎవరిపై పోరాటం చేస్తున్నారు?’ అని పల్లా నిలదీశారు. ప్రభుత్వానికి లేదా పార్టీకి నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదని.. ఇలాంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని మందలించారు.
ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు బాధ్యతాయుతంగా మెలగాలని.. వ్యక్తిగత ఎజెండాల కంటే పార్టీ క్రమశిక్షణ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పల్లా ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ హెచ్చరికతోనైనా కొలికిపూడి తన వైఖరి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.