![Political news in ap Political news in ap](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/02/second-day-assembly-in-1024x576.jpg)
AP Assembly Sessions 2024(Political news in AP): రెండో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమవ్వగానే.. టీడీపీ ఎమ్మెల్యేలు పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అనంతరం తొలిరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చను ప్రారంభించారు.
అంతకుముందు అసెంబ్లీ వెలుపల.. అసెంబ్లీ క్రాస్ రోడ్ నుంచి ప్రధాన గేటు వరకూ.. టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ధరలు, పన్నులు, ఛార్జీల భారంతో సామాన్యుడు విలవిలలాడుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పెరిగిన నిత్యావసర ధరలపై ప్రభుత్వం ఎలాంటి ఊరట చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యులు.. బాదుడే బాదుడు అని నినాదాలు చేస్తుండగా.. ఆ నినాదాల మధ్యే ఏపీ మంత్రులు బిల్లుల్ని ప్రవేశపెడుతున్నారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలబడి.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు నేడు సర్పంచుల సంఘం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా.. సర్పంచులంతా ఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ వద్దకు వచ్చిన సర్పంచులను పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్థికసంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందని, సర్పంచుల నిధులు సర్పంచులకే ఇవ్వాలని ఆందోళన చేస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సర్పంచులపై పోలీసులు లాఠీచార్జి చేసి.. అదుపులోకి తీసుకుంటున్నారు. లాఠీచార్జి లో పలువురు సర్పంచులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.