ఏపీలో సంప్రదాయ రాజకీయాలు నానాటికీ కనుమరుగవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్సార్ రాజకీయాలను తెలుగు ప్రజలు వీక్షించారు.చంద్రబాబు, వైఎస్సార్ హయాంలో రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్, చంద్రబాబులు ప్రతిపక్ష, అధికార పక్ష నేతలుగా ఉన్నా ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు. ప్రభుత్వం చేసే తప్పులను మాత్రమే ఎత్తిచూపారు. అశాంతికి చోటు లేకుండా నిరసనలు తెలిపేవారు. కానీ, గత జగన్ ప్రభుత్వాన్ని తొలిసారి చూసిన తెలుగు ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రతిపక్ష నేతలను ప్రభుత్వంలోని పెద్దలు విమర్శించడం కామన్.. వారి పాలసీలు, తప్పుడు విధానాలను విమర్శించడం ఓకే.. కానీ, బూతులు తిట్టే సంస్కృతిని, కుటుంబ సభ్యులు, అందులోనూ మహిళలు, వారి తల్లిదండ్రులను తిట్టే సంప్రదాయాన్ని ఎన్నడూ చూడలేదని ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు.
సాధారణంగా ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడాలి. ఎన్నికల సమయంలో ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తే వాటిపై నిలదీయాలి. ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించాలి. అంతేగానీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ రాజకీయాలు చేయడం.. ప్రజల్లో విద్వేషాలు రేకెత్తించి అశాంతిని క్రియేట్ చేసి ఆ మంటల్లో చలికాచుకుని రాజకీయంగా లబ్డి పొందాలని చూడటం సరికాదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అదే తరహా రాజకీయాలు చేస్తున్నట్టు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న గుంటూరులో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు తండ్రిని మీడియా ముందు దూషించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు సహించలేకపోయారు.
ఎవరైనా తాము దైవంగా ఆరాధించే వ్యక్తిని, పార్టీని దూషిస్తే కొందరు భరించలేరు. నిన్న గుంటూరులో అదే జరిగింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతో తెలుగుతమ్ముళ్లు కోపంతో ఊగిపోయారు.అంబటి రాంబాబు ఇళ్లు, ఆయన ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. కార్లు ధ్వంసం చేశారు. రాత్రివరకు అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.కొందరు మూకలు ఆయన కారు, ఇంటికి నిప్పు పెట్టగా పోలీసులు ఆర్పివేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు అంబటి మీద పోలీసులు రెండు కేసులు పెట్టి నల్లపాడు పీఎస్కు తరలించారు. రాష్ట్రంలో అశాంతి, ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించినందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి.
KCR Interrogation: కేసీఆర్ ఇంట్లో సిట్ అధికారుల విచారణకు సర్వం సిద్ధం.. విచారణ షురూ!
వైసీపీ నేతలకు చంద్రబాబును, ఆయన కుటుంబసభ్యులను తిట్టడం కొత్తేమీ కాదు. గతంలో వారు అధికారంలో ఉన్న సమయంలో ఆయన సతీమణిపై అసభ్య ఆరోపణలు చేశారు. ప్రస్తుత మంత్రి నారాలోకేశ్ జన్మను అవమానించారు.దీనికి తోడు తాజాగా సీఎం తండ్రిని దూషించారు. ఒక్క అంబటి రాంబాబు మాత్రమే కాదు. గతంలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మరికొందరు నేతలు ఆయన కుటుంబంపై తీవ్ర దూషణలు చేసిన వారే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపికగా ఉన్న తెలుగుతమ్ముళ్లు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా దూషించే సరికి తట్టుకోలేకపోయారని,వారిలో ఓపిక నశించి ఆగ్రహం కట్టలు తెంచుకున్నదని చర్చ జరుగుతోంది. అందుకే మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడేలా అంబటికి తగిన బుద్ది చెప్పడంతో పాటు వైసీపీ నేతలకు బలమైన సంకేతాలు పంపించారని ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు మీద అంబటి చేసిన వ్యాఖ్యలను జనసేనికులు సైతం తప్పుబట్టారు. పార్టీ తరఫున ఖండించడంతో పాటు ఆయన్ను శిక్షించాలని డిమాండ్ చేశారు.