Hyderabad Crime: హైదరాబాద్ శివారులోని దుండిగల్ పరిధి బౌరంపేటలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లే కాలయముడుగా మారి, తన రెండు నెలల పసికందును సజీవ దహనం చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా.. ఆ తల్లి చేసిన పని స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక వలస కుటుంబం బౌరంపేటలోని ఒక అపార్ట్మెంట్లో పని చేస్తూ అక్కడే నివసిస్తోంది. ఆ దంపతులకు రెండు నెలల మగ శిశువు ఉన్నాడు. అయితే.. ఆ పసికందు నిరంతరాయంగా ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆ తల్లి కోపం పెంచుకుంది. ఆ కోపం కట్టలు తెంచుకోవడంతో.. పసివాడని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించింది.
బిడ్డ ఏడుపు ఆపడం లేదన్న కోపంతో.. ఆ తల్లి పసికందు చేతులు, కాళ్లు కట్టేసింది. బిడ్డ అరుపులు బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. అంతటితో ఆగకుండా.. మండుతున్న కట్టెల పొయ్యిలోకి ఆ చిన్నారిని విసిరేసింది. ఆ మంటల్లో పసికందు సగం కాలిపోయి.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఏసీపీ శంకర్ రెడ్డి పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: అప్పు ఇచ్చారని ఇంత రాక్షసత్వమా? కాలువలో దూకి మహిళ ఆత్మహత్య!