KCR Farmhouse Siege: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఫామ్హౌస్ను ముట్టడించారు. ఫామ్హౌస్ మెయిన్ గేటు ముందు బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్ను గెలిపిస్తే, ఆయన మాత్రం ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఫామ్హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా సభకు వెళ్ళి ప్రజల గొంతుక వినిపించాల్సిన బాధ్యత ఆయనపై లేదా అని నిలదీశారు. కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఇంటికే పరిమితం కావడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని విమర్శించారు.
“గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీరు వెంటనే అసెంబ్లీకి వెళ్ళాలి. సభలో మాట్లాడే ఓపిక, ఆసక్తి లేకపోతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అని ఆంక్ష రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో గెలిచి, వారి కష్టాలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ శ్రేణులు భీష్మించుకు కూర్చోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తన ఫామ్హౌస్కే పరిమితం కావడంపై… pic.twitter.com/qw3fpeZVgV
— ChotaNews App (@ChotaNewsApp) January 4, 2026
Read Also: ఆటో ఇస్తారా.. పామును వదలమంటారా? ట్రాఫిక్ పోలీసులకు డ్రైవర్ వింత బెదిరింపు!