Duvvada Srinivas Wife Vani to Contest Assembly Elections as Independent in Tekkali: శ్రీకాకుళం రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈసారి ఎలాగైనా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఓడించడానికి శాయిశక్తులా కృషి చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల కోడ్కు ముందు నుంచే వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను ఆ జిల్లాకు, ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గానికి రప్పించుకున్నారనే వాదన సాగుతోంది. ఇదే క్రమంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
టెక్కలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు వాణి. అందుకు సంబంధించి తెరవెనుక చకచకా పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తన అనుచరుల వద్ద ప్రకటించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. దువ్వాడ శ్రీను- ఆయన వైఫ్ వాణికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు ఆ జిల్లా ప్రజలే స్వయంగా చెబుతున్నారు. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఆమె ఉన్నట్లు సమాచారం.
ఫ్యామిలీ సమస్యల నేపథ్యంలో కొన్నాళ్ల కిందట ఈసారి ఎన్నికల్లో తన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ వద్ద మొర పెట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. పరిస్థితి గమనించిన సీఎం జగన్, ఆమెని నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించారు. అభ్యర్థుల జాబితా ప్రకటించేవరకు పార్టీలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల జాబితాలో దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించింది వైసీపీ హైకమాండ్. అప్పటినుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారట.
Also Read: Police deployed Bonda Uma angry: నేనేమి తప్పు చేశాను, తెలంగాణ పరిస్థితి వద్దని..
గురువారం వాణి పుట్టినరోజు కావడంతో కార్యకర్తలు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఈనెల 22న తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. పార్టీలో శ్రీనివాస్ వ్యవహారశైలి నచ్చక చాలామంది వెళ్లిపోతున్నారని అంటున్నారు. వాణి విషయం తెలియగానే దువ్వాడ శ్రీనివాస్ అగ్గిమీద గుగ్గిలమయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సొంత ఇల్లు చక్కబెట్టుకోకుండా ప్రత్యర్థిపై ఓవర్గా కామెంట్స్ చేయడమే దీనికి కారణమని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి అచ్చెన్నాయుడిని ఓడించాలన్న అధినేత జగన్ ఆలోచన బూమరాంగ్ అయినట్టు ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం కొసమెరుపు.