Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కీలో 5.6 తీవ్రతతో భూమి కంపించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. టర్కీ రాజధాని అంకారాకు తూర్పున 450 కిలోమీటర్ల దూరంలోనున్న టోకట్ ప్రావిన్స్ లోని సులుసరాయ్ నగరంలో భూకంపం సంభవించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ప్రెసిడెన్సీ వెల్లడించింది.
కాగా.. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏప్రిల్ 19 ఉదయం 1.20 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించగా.. నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా.. గతేడాది ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం టర్కీ చరిత్రలోనే మరచిపోలేనిది. సౌత్ టర్కీలో 7.8 తీవ్రతతో భూమి కంపించగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నివాసం లేక అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయాన్ని తలచుకుంటే.. ఇప్పటికీ బెదిరిపోతున్నారు టర్కీవాసులు.