Bonda Uma Arrest news: ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహారశైలిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ. డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా సిండికేట్గా ఏర్పడి టీడీపీ అభ్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నేరగాడి చేతిలో పోలీసులు కీలుబొమ్మలా మారిపోవడం దుర్మార్గమన్నారు.
నామినేషన్ వేసిన తనను నిత్యం పోలీసులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు బొండా ఉమ. ఐపీఎస్ లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, వంద మంది పోలీసులు శుక్రవారం మా ఆఫీసును ఎందుకు చుట్టుముట్టారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
సీఎం జగన్ పై గులకరాయి వేసిన వ్యక్తి వేముల సతీష్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అన్ని ఫేక్ ఆధారాలను క్రియేట్ చేసి మైనర్ని రిమాండ్కు తరలించారని పేర్కొన్నారు. నిందితుడు పేరెంట్స్ని పోలీసులు చిత్ర హింసలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాము చెప్పినట్టు 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని జైలులో ఉంచుతామంటూ పోలీసులు బెదిరించారని దుయ్యబట్టారు. ఇంటి పేరు ఒకటే ఉండడంతో బీసీ నాయకుడు వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని ఆరు రోజులైందన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీదన్నారు.
Also Read: బంగారం లేని బాబు.. కేసులు 20కి పైగానే!
పనిలోపనిగా పోలీసు కమిషనర్ క్రాంతిరాణాపై ఆగ్రహం వ్యక్తంచేశారు బొండా ఉమ. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది ఐపీఎస్ అధికారులు జైలులో ఉన్నారని, కొందరు ఊచలు లెక్కబెడుతున్నారని, మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. ఆ పరిస్థితి పోలీసు అధికారులు తెచ్చుకోవద్దన్నారు. ధర్మాన్ని, చట్టాన్ని పాటించాలని పోలీసులకు హితవు పలికారు. ఎన్నికల ప్రధాన అధికారి, హైకోర్టు జడ్జికి మెసేజ్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత రాయి ఘటనపై విచారణ చేయిస్తామన్నారు.