New Year Wishesh : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. 2025లో రాష్ట్ర ప్రజలకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకున్నారు. 2024 సంవత్సరంలో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోందంటూ ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు.. కేవలం ఆరు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేసిందని వ్యాఖ్యానించారు. నిరుపేదల భవిష్యత్కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై కూటమి ప్రభుత్వం పేద ప్రజలందరికీ కట్టెల పొయ్యి కష్టాల్ని తప్పించి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు.
రైతులు, మహిళల గురించి ప్రవేశపెట్టిన పథకాల్ని తెలిపిన చంద్రబాబు నాయుడు.. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపామంటూ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రోడ్లు ప్రమాదకరంగా ఉన్న సంగతిని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయాణం సాఫీగా సాగాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని రహదారులన్నింటినీ గుంతలు లేకుండా చేస్తున్నామని తెలిపారు.
కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికినట్లు తెలిపారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్రాభివృద్ధిని రాష్ట్ర ప్రజలందరి సహకారంతో చేసి చూపిస్తామని తెలిపారు.