Cold Wave: తెలంగాణ రాష్ట్రం గత కొన్ని రోజులుగా తీవ్రమైన చలితో గజగజ వణుకుతోంది. విపరీతమైన చలిగాలులు వీస్తుండటంతో పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోకి పడిపోయాయి. సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి గాలుల తీవ్రత నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్లో 6.7, సంగారెడ్డిలో 6.5, కొమురం భీమ్లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్లోనూ 10డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 9 నుంచి 10 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు చలిమంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఉత్తర, ఈశాన్య దిశ నుంచి చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల నుంచి 4డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉంది. చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇటు తెలంగాణలోనే కాకుండా ఏపీని కూడా చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. గత వారం రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వంజంగి, చింతపల్లి, పాడేరులో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ముగిసిన ప్రచారం!
దట్టంగా కురుస్తున్న పొగ మంచుతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలతో సేద తీరుతున్నారు. చలితో తీవ్రతతో వృద్ధులు, చిన్న పిల్లల ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి, పగలు సైతం చలి ప్రభావం చూపుతుండగా మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండకాస్తున్నది. ఉదయం తొమ్మిది దాటినా పొగమంచు వీడటం లేదు. కావున, చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అల్లూరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
చింతపల్లిలో 10 డిగ్రీల సెల్సియస్, లంబసింగిలో 8, పాడేరులో 10, అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు
దట్టంగా కురుస్తున్న పొగ మంచు
చలి మంటలతో సేద తీరుతున్న గిరి పుత్రులు
చలితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పిల్లలు pic.twitter.com/g9GSDxH7z3
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2025