ఏపీ మంత్రి నారాలోకేశ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన హెచ్చరికలు పంపారు. పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు ఎవరైనా పార్టీ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్ ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. ఇటీవల కాలంలో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మంత్రి లోకేశ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా, గ్రాఫెల్, మైనింగ్ వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అది కాస్త పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లడంతో పాటు ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ గరం అయ్యారు. ఒకరిద్దరి వ్యవహారం వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే వారు పార్టీకి అవసరం లేదు అనే సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఎవరైనా పార్టీ నియమాలకు లోబడి ఉండాలని, లేదంటే బయటకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని వారికి అల్టీమేటం చేసినట్టు సమాచారం. మంత్రి లోకేశ్ వార్నింగ్ను కొందురు ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే వారు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని తెలుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి కొందరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు ప్రస్తుతం అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని కొందరు సీనియర్ నేతలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా వారిపై సర్కారు ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. వారంతా కూటమి సర్కారుకు చెడ్డపేరు తీసుకోవడం కోసమే పనిచేస్తున్నట్టు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని వారు ఇదివరకే డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేశ్ వారి గురించి ప్రస్తావించారు. పరోక్షంగా వారికి సైతం హెచ్చరికలు పంపారు. గీత దాడితే అంతేు సంగతులు.. బయటకు వెళ్లాల్సి ఉంటుందని ఖరాఖండీగా చెప్పినట్టు సమాచారం.
ఈవీ కార్లకూ యుద్ధం దెబ్బ.. ఆగిన ఉత్పత్తి, ఇప్పట్లో కొనలేమట.. ఎందుకంటే?
కాగా, మంత్రి నారాలోకేశ్ ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షించడం, వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు గీత దాటిన వారికి హెచ్చరికలు పంపడం మంచి పరిణామమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తప్పు చేస్తున్న వారిని ఇప్పుడు కట్టడిచేయకపోతే మున్ముందు వారి నియోజకవర్గాల్లో పార్టీకి గ్రాఫ్ పడిపోతుందని, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఆస్కారం లేకపోలేదని వారు అంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేసేవారిని మెచ్చుకుంటూనే తప్పు చేసేవారికి క్లాస్ పీకడం వలన ఎమ్మెల్యేలు సన్మార్గంలో వెళతారని ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలను ఇకమీదట జరగకుండా మంత్రి నారా లోకేశ్ పర్ఫెక్ట్ విజన్, నాయకత్వంతో ముందుకు వెళ్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.