వరుస సెలవుల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, ఇతర వరుస సెలవులు తోడవడంతో దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుమల కొండపై ఎటు చూసినా భక్తుల సందోహమే కనిపిస్తోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు 30 గంటలకు చేరుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయాయి. చివరకు క్యూలైన్ శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించింది.
అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం:
క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, టీ, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యూలైన్ల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేస్తున్నారు.
అలిపిరి వద్ద ఉద్రిక్తత.. అధికారుల వివరణ
మరోవైపు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం (SSD) టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. రోజువారీ కోటా కింద కేటాయించిన 15,000 టోకెన్లు త్వరగానే ముగిసిపోవడంతో అధికారులు కౌంటర్లను మూసివేశారు. టోకెన్లు లభించని భక్తులు ఆందోళనకు దిగడంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. కౌంటర్ల సంఖ్య పెంచాలని, ఏర్పాట్లు సరిగ్గా లేవని భక్తులు ఆరోపించారు. అయితే, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఎస్పీ సుబ్బారాయుడు కీలక సూచనలు..
ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందిస్తూ భక్తులకు పలు సూచనలు చేశారు. ‘కేటాయించిన టోకెన్లు పూర్తి కావడంతోనే కౌంటర్లు మూసివేశాం. దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారనే ఆశతో వందలాది మంది భక్తులు అక్కడ వేచి ఉండటం వల్ల రద్దీ పెరిగింది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ లేదా తొక్కిసలాట జరగలేదు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను ఎవరూ నమ్మవద్దు’ అని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారని ఆయన తెలిపారు.
భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం..
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో (శని, ఆది, సోమవారాలు) శ్రీవారి ఆఫ్ లైన్ టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమలలోని కౌంటర్లతో పాటు రేణిగుంట విమానాశ్రయంలో కూడా ఈ టికెట్లు అందుబాటులో ఉండవు. భక్తులు ఈ మార్పును గమనించి.. అందుకు అనుగుణంగా తమ దర్శన ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అవాంతరాలు కలగకుండా ఉండేందుకు భక్తులు సహకరించాలని కోరారు.
ALSO READ: Bangladesh: బంగ్లాదేశ్లో ఆగని హింస.. మరో హిందూ యువకుడి దారుణ హత్య