Tirumala: తిరుమలలో శ్రీవారి టికెట్లు ఇప్పిస్తామని చెప్పి భక్తులను నిలువునా ముంచేస్తున్నారు బ్రోకర్లు. తీరా వారి గురించి తెలుసుకునే సరికి అక్కడి నుంచి పరారవుతున్నారు. తాజాగా ఇద్దరు దళారీలు ఓ యువతిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్తే..
శ్రీవారి భక్తురాలికి కుచ్చుటోపి
టీటీడీ ఛైర్మన్ కార్యదర్శిని చెప్పి శ్రీవారి భక్తురాలిని మోసం చేశారు ఇద్దరు బ్రోకర్లు. వారిపై తిరుమల టూటౌన్ పోలీసులు రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన సంఘమిత్ర యువతి, విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో పీజీ చదువుతోంది. అనుకోకుండా ఆ యువతి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లింది.
రెండున్నర లక్షలకు పైగా
ఛైర్మన్ సెక్రటరీనని చెప్పుకొనే దీపుబాబు, పవన్కుమార్ అనే ఇద్దరు దళారులను ఆశ్రయించింది. ఐదు వీఐపీ బ్రేక్, మరో ఐదు సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తామని చెప్పారు నిందితులు. నిజమేనని ఆ భక్తురాలు నమ్మేసింది. ఫోన్పే ద్వారా రూ.2.60 లక్షలు వారికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత వారు ఫోన్ స్విచాఫ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసిన నెంబర్ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇటీవలకాలంలో తిరుమలలో టికెట్ల పేరిట మోసాలు పెరిగాయి. తక్కువ సమయంలో తిరుమలకు వచ్చిన భక్తులు దళారుల మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు లేకపోలేదు.
ALSO READ: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. జూన్ దర్శనం టికెట్లు విడుదల
గతంలో దళారులకు ఆశ్రయిస్తే శ్రీవారి దర్శనం జరిగేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మారిన విషయాన్ని తెలుసు కోలేపోతున్నారు. ఇప్పుడు అదే మాయలో పడి చాలామంది భక్తులు డబ్బులు పొగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ పదే పదే హెచ్చరిస్తున్నా దళారుల మాయలో పడిపోతున్నారు భక్తులు.
శ్రీశైలంలో కూడా ఇలాగే
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కొత్త తరహా మోసం బయటపడింది. శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్ సైట్లు కలకలం రేపుతున్నాయి. వీటని నమ్మి భక్తులు మోసపోతున్నారు. లేటెస్టుగా హైదరాబాద్, ముంబైకి చెందిన శివుడి భక్తులు ఆన్ లైన్లో నకిలీ వెబ్సైట్ ద్వారా మల్లికార్జున సధన్ నందు వసతి కోసం రూములు బుక్ చేసుకున్నారు.
శ్రీశైలం వచ్చి బుకింగ్ చేసుకున్న మెస్సేజ్లు చూపించడంతో అక్కడ సిబ్బంది అవాక్కయ్యారు.నకిలీ వెబ్సైట్లలో తాము మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు భక్తులు. శ్రీశైలంలో భ్రమరాంబిక-మల్లికార్జునస్వామి వారిని దర్శించు కోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తుల వీక్నెస్ని కొంతమంది కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేశారు.
వసతి కోసం ప్రయత్నించే భక్తులను మోసం చేస్తున్నారు. వసతి గదులను ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే కేటాయించడంతో సైబర్ మోసగాళ్లకు ఆసరాగా మారింది. దేవస్థానం అధికారులు ఈ మోసాలపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.