Tiruvuru Issue: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వివాదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని పల్లా శ్రీనివాస్ చెప్పారు. అయితే దుబాయ్ నుంచి వచ్చాక తానే స్వయంగా మాట్లాడతానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
కొందరు నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంతటి వారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం జరపాల్సిన తిరువూరు పంచాయితీ, ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొలికపూడి ఏదొక వివాదంలో రెచ్చకెక్కుతున్నారు. గతంలో తిరువూరులో బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని బహిరంగంగా విమర్శలు చేశారు. అనంతరం టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో వివాదంతో మరోసారి చర్చల్లో నిలిచారు. ఈ వివాదంతో ఇకపై మాటల్లేవని సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ కేశినేని చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అయితే తాజాగా తాను కేశినేని చిన్నికి రూ.3.50 కోట్లు ఇచ్చానని బ్యాంకు స్టేట్ మెంట్ లను వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించారు.
అందుకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 లక్షల చొప్పున మూడుసార్లు రూ.60 లక్షలు కేశినేని చిన్నికి ట్రాన్స్ఫర్ చేసినట్టు బ్యాంక్ స్టేట్ మెంట్ ను ఎమ్మెల్యే కొలికపూడి ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. ఎంపీ కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి రూ.50 లక్షలు తీసుకెళ్లారన్నారు. తన స్నేహితులు ఇచ్చిన రూ.3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజమే గెలవాలి అంటూ పోస్ట్ పెట్టారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎంపీ పీఏ కీలకంగా ఉన్నారని కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను తన జేబులో డబ్బులు మాత్రమే ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. కేవలం ఐదు, పది లక్షల గురించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తానెప్పుడూ రంగులు మార్చలేదన్నారు. 12 నెలలు దేవుడిగా ఉన్న తాను ఇప్పుడు దెయ్యంగా మారిపోయానా? అని ఎమ్మెల్యే కొలికపూడిని ప్రశ్నించారు. ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే తాను లేనని చెప్పిన కొలికపూడి ఇప్పుడు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ను విమర్శించే వారిని శత్రువుల్లాగే చూస్తానన్నారు. తాను వైసీపీ నేతలతో అంటకాగే వ్యక్తిని కాదన్నారు.