Jagan: అట్టహాసంగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం. దేశమంతా అటువైపే చూసింది. సెంగోల్ ఆవిష్కరణతో ప్రధాని మోదీ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. మొత్తంగా అత్యంత ఘనంగా ముగిసిందా కార్యక్రమం. కేంద్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ ఆరంభోత్సవంలో.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి మంచి ప్రాధాన్యం లభించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కొత్త పార్లమెంట్లో మొదటి వరుసలోనే ఆసీనులయ్యారు ముఖ్యమంత్రి జగన్. పలువురు కేంద్రమంత్రులు సైతం వెనుక సీటింగ్కే పరిమితం కాగా.. కీలకమైన ప్రజాప్రతినిధులకు మాత్రమే ఫ్రంట్ లైన్ ప్రధాన్యం దక్కింది. అందులో సీఎం జగన్ కూడా ఉండటం విశేషం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పక్కనే కూర్చొన్నారు జగన్. కొంచెం పక్కగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు ఆసీనులయ్యారు. కొద్దిసేపు అమిత్షా పక్కనా కూర్చున్నారు జగన్. అలా హేమాహేమీల సరసన జగన్కు ప్రత్యేక స్థానం కల్పించింది కేంద్రం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు? జగన్కు అంత టాప్ ప్రయారిటీ ఎందుకు?
రెండు మూడు వెర్షన్లు వినిపిస్తున్నాయి. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్తో సహా దేశంలోని అనేక విపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఆయా పార్టీలను తప్పుబడుతూ.. వాళ్లు కూడా హాజరుకావలంటూ లేఖ రాసి కేంద్రంపై తమ అభిమానాన్ని బహిరంగంగానే చాటుకున్నారు జగన్. పార్లమెంట్ ఈవెంట్కు టీడీపీ, వైసీపీలాంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రమే విచ్చేశాయి. సో, ఓ విపక్ష పార్టీ అధినేతగా, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డికి ఆ అదనపు గౌరవం ఇచ్చారని అంటున్నారు. డుమ్మా కొట్టిన ప్రతిపక్షాలకు హితవు పలికినందుకు.. ఆయన్ను ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టి.. బీజేపీయేతర పార్టీ సీఎం కూడా వచ్చారనేలా ప్రొజెక్ట్ చేయడమే కేంద్ర వ్యూహం అంటున్నారు.
ఇక, ఎంతకాదన్నా బీజేపీ-కేంద్రం.. వైఎస్సార్సీపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందనేది ఓపెన్ సీక్రెట్. ఇటీవలే దండిగా కేంద్ర నిధులనూ రిలీజ్ చేసి.. జగన్పై తమ ఉదారతను చాటుకున్నారు. కేంద్ర తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా ఫుల్గా సపోర్ట్ చేస్తూ వైసీపీ సైతం తమ విధేయతను చాటుకుంటోంది. బీజేపీకి ఇంతకన్నా మంచి మిత్రుడు ఇంకెవరుంటారు? అందుకే, జనసేనాని ఎంతగా గింజుకుంటున్నా.. బీజేపీ మాత్రం జగన్ విషయంలో న్యూట్రల్గానే ఉంటోంది. కేంద్రం తరఫున సపోర్ట్ కూడా చేస్తోంది. ఢిల్లీకి ఎప్పుడొచ్చినా.. కాదనకుండా కేంద్రపెద్దలంతా కలుస్తున్నారు. ఇవ్వాల్సినన్ని నిధులు ఇస్తున్నారు. ఆ స్నేహమే.. కొత్త పార్లమెంట్లో జగన్కు ముందు వరుస కుర్చీని కేటాయించేలా చేసిందంటున్నారు విశ్లేషకులు.