TTD AI Chatbot: తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి భక్తులకు.. ఆధునిక సాంకేతిక సౌకర్యాలను అందించే దిశగా ముందడుగు వేసింది. భక్తుల సౌకర్యం కోసం ఇప్పటికే అనేక డిజిటల్ సేవలను అందిస్తున్న టీటీడీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్బాట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ చాట్బాట్ ద్వారా భక్తులు తమ ప్రశ్నలకు తక్షణ సమాధానాలు పొందగలుగుతారు.
ఈ చాట్బాట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఒక్క తెలుగు, ఇంగ్లీష్ లోనే కాకుండా.. మొత్తం 13 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో సేవలు అందించనుంది. భాషా అడ్డంకులు లేకుండా దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన భక్తుడు సులభంగా తన ప్రశ్నను అడిగి, తక్షణ సమాచారం పొందగలుగుతాడు.
ఏఐ ఆధారిత ఈ చాట్బాట్ ద్వారా భక్తులు ఆన్లైన్లో అందించే శ్రీవారి దర్శనం, సేవలు, వసతి గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాదం ఆర్డర్ వివరాలు, తిరుమలలో రవాణా సదుపాయాలు, దాతృత్వ సేవలు, సహాయక కేంద్రాలు వంటి అనేక అంశాలపై సమాచారం పొందగలుగుతారు.
టీటీడీ ఈ ప్రాజెక్ట్ కోసం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక టెక్నాలజీ సంస్థలకు టెండర్లు ఆహ్వానించింది. వీటిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సంస్థ ప్రతిపాదన ఉత్తమమని గుర్తించి, టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. AWS సంవత్సరానికి కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఈ సేవలను అందించనుంది.
అమెజాన్ ఆధారిత ఈ చాట్బాట్ క్లౌడ్ టెక్నాలజీపై పనిచేస్తుంది. దీని ద్వారా సమాచారం భద్రతతో పాటు అత్యంత వేగంగా అందుతుంది.
టీటీడీ ఇప్పటికే డిజిటల్ మార్పు దిశలో పలు కార్యక్రమాలు చేపట్టింది. మొబైల్ యాప్, QR ఆధారిత దర్శన టికెట్లు, ఆన్లైన్ వసతి బుకింగ్స్, డిజిటల్ డొనేషన్స్ వంటి సేవల తరువాత ఇప్పుడు ఏఐ చాట్బాట్ ప్రవేశపెట్టడం ద్వారా మరో ముఖ్యమైన దశను చేరుకుంది. భక్తులు ఇక లైన్లో నిలబడకుండా, కాల్ సెంటర్కి ఫోన్ చేయకుండా కేవలం ఒక క్లిక్తో అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు.
Also Read: ఏపీ రాజకీయాల్లో దుమారం.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలన వీడియో, ఇదీ జరిగింది?
టీటీడీ ధర్మకర్తల మండలి ఈ ప్రాజెక్ట్పై సానుకూలంగా స్పందించింది. భక్తుల సేవలో సాంకేతికతను వినియోగించడం తమ ధ్యేయమని, అమెజాన్తో ఒప్పందం ఈ దిశలో ఒక చారిత్రాత్మక అడుగని పేర్కొంది. మండలి సభ్యులు మాట్లాడుతూ.. తిరుమల భక్తుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. అందువల్ల సమయానికి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వ్యవస్థ అవసరం. ఏఐ చాట్బాట్ ఈ అవసరాన్ని తీర్చగలదు అని తెలిపారు.