Janga Krishnamurthy: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎంను కోరారు. రాజీనామా చేయడానికి గల కారణాలను లేఖలో జంగా కృష్ణమూర్తి సీఎంకు వివరించారు. గతంలో బాలాజీ నగర్లో ప్లాట్ నెంబర్ 2 తనకు కేటాయించాలని టీటీడీ బోర్డును కోరగా.. ప్రభుత్వం అందుకు ఆమోదముద్ర వేసింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ భూకేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కారణంగా తాను టీటీడీ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది.
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జంగా వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జంగా కృష్ణమూర్తికి చోటు దక్కింది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా జంగా కృష్ణమూర్తికి స్థానం లభించింది. గతంలో జంగా కృష్ణమూర్తి వైసీపీలో ఉన్నారు. పల్నాడులోని గురజాలకు చెందిన ఆయనకు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో టీటీడీ ఛైర్మన్ పదవి వస్తుందని ప్రచారం కూడా జరిగింది. టీటీడీ ఛైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేసిన తర్వాత జంగా కృష్ణమూర్తిని ఛైర్మన్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి దక్కింది. 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జంగా.. టీడీపీలో చేరారు.
2005లో తిరుమల బాలాజీనగర్లో డొనేషన్ స్కీమ్ కింద ప్లాట్ నెంబర్ 2.. 500 గజాల స్థలాన్ని టీటీడీ జంగా కృష్ణమూర్తికి కేటాయించింది. ఈ స్థలంలో 12 గదులతో గెస్ట్ హౌస్ నిర్మించాలని నిర్ణయించారు. ఒక గది మినహా మిగిలిన 11 గదులను భక్తులకు ఇవ్వాలని భావించారు. గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఓ ట్రస్టు కూడా ఏర్పాటు చేయాలని భావించారు. అయితే డబ్బులు సర్దుబాటు కాక గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టలేకపోయానని కృష్ణమూర్తి తెలిపారు. డొనేషన్ చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు.
టీటీడీకి ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలో రూ.60 లక్షల వరకు డొనేషన్ చెల్లించినట్లు కృష్ణమూర్తి తెలిపారు. అయితే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలుసుకుని, తన డొనేషన్ వెనక్కి ఇచ్చేశారన్నారు. అలాగే తన గెస్ట్ హౌస్ ప్రతిపాదన తిరస్కరించారన్నారు. స్థలం తనకు మళ్లీ కేటాయించాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశానన్నారు. ఈ విషయాన్ని టీటీడీ బోర్డుకు పంపారని, బోర్డులో భానుప్రకాష్రెడ్డి తప్ప మిగతా సభ్యులంతా స్థలం కేటాయింపునకు అంగీకరించారన్నారు.
ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిగా.. బోర్డులో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బోర్డులో జరుగుతున్న చర్చపై కొందరు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రావడంతో మనస్తాపం చెందానన్నారు. ప్రభుత్వానికి, సీఎంకు తన వల్ల ఇబ్బంది రాకూడదనే రాజీనామా చేశానన్నారు. స్థలం కేటాయింపు విషయంలో కేబినెట్ లో ఏం చర్చ జరిగిందో తనకు తెలియదని జంగా కృష్ణమూర్తి తెలిపారు.
Also Read: తిరుమల పవిత్రతపై రాజకీయ కుట్ర.. మద్యం సీసాల కలకలం వెనుక అసలు నిజం ఇదే!