Tirumala Updates: అసలే కార్తీకమాసం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 66,163 మంది భక్తులు దర్శించుకోగా.. 25,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.86 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: TTD Board Members: టీటీడీ కొత్త టీమ్ ఏం చేయబోతుందంటే..?
అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ నూతన చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒకరోజులో ఎంతమంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు.