TTD Updates: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
డిసెంబరు 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలలో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. డిసెంబరు 21న వర్చువల్ సేవల కోటాలో.. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. డిసెంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు.. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా.. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా కింద వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Also Read: Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. తిరుగు ప్రయాణంలో ఇలా చేయాలని మీకు తెలుసా?
మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే తిరుమల, తిరుపతిలలో మార్చి నెల గదుల కోటాను డిసెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.