Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు న మోదు చేశారు.
సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులైలో వంశీతో పాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, టీడీపీ కార్యకర్త కిడ్నాప్ సహా పలు కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. తాజాగా మరో కేసు నమోదు కావడంతో వంశీని మళ్లీ అరెస్టు చేస్తారా? అంటూ చర్చలు మొదలయ్యాయి. టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 16న వంశీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పలు కేసులు వరుసగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ వంశీపై 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వంశీ ఇప్పటి వరకూ 140 రోజులు జైలులో గడిపారు. తాజాగా మరో కేసు నమోదు కావడంతో చర్చ మొదలైంది.
వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై వంశీపై పలు కేసులు ఉన్నాయి.