Vijayawada News: విజయవాడ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ న్యూస్. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినా ఎలాంటి జాడ లేదని సమాచారం. ఇంతకీ వంశీకి ఏమైనట్టు? ఎందుకు పోలీసులు ఆయన కోసం ఆరా తీస్తున్నారు.
అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయ్యింది. అయినా కొందరు వైసీపీ నేతలకు అరెస్టుల భయం వెంటాడుతోంది. ఆనాడు చంద్రబాబు, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసిన నేతలకు కష్టాలు తప్పలేదు. ఇప్పటికే పలువురు నేతలు అరెస్టు అయ్యారు. మరికొందరు అదే రూట్లో ఉన్నారు. ఆనాడు చేసిన పాపాలు ఆ నేతలను ఇప్పుడు వెంటాడుతున్నాయి.
ఇటీవల ఓ కిడ్నాప్ కేసులో దాదాపు నాలుగున్నర నెలలు జైలు జీవితం గడిపాడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత మాజీ సీఎం జగన్ని ఇంటికి వెళ్లి కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ మెల్లగా తన నియోజకవర్గంలో పర్యటన మొదలుపెట్టారు. వారంలో మూడు రోజులు మూడేసి గ్రామాలు తిరుగుతున్నారు.
వెంటాడుతున్న మరో కేసు
ఇదిలాఉండగా వల్లభనేని వంశీకి ఓ కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కాకపోతే ఆయన అందుబాటులో లేరు. నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు వెయిట్ చేశారు. చివరకు ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో పోలీసులను అనుమానం వచ్చింది. ఆయన కోసం గాలింపు మొదలు పెట్టారు. ఇంతకీ ఈసారి ఆయనపై ఉన్న కేసు ఏంటి?
విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్లో హత్యాయత్నం కేసు ఒకటి ఈనెల 17న నమోదైంది. అందులో వంశీని నిందితుడిగా పేర్కొన్నాడు ఫిర్యాదుదారుడు. గతేడాది అంటే 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయాలని వంశీ తన అనుచరులను పంపాడన్నది ప్రధాన పాయింట్. ఈ క్రమంలో వంశీ అనుచరులు కర్రలు, మారణాయుధాలతో తనను తీవ్రంగా గాయపర్చారని పేర్కొన్నాడు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా పడిపోతున్న ఉష్టోగ్రతలు
ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రధాన నిందితుడిగా వంశీతోపాటు రామకృష్ణ, కొమ్మా కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, బాబు, ప్రభుకాంత్, రవిలను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి వారం రోజులుగా వంశీ ఇంటికి వెళ్తున్నారు పోలీసులు. విచారణ కోసం ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.
కానీ వంశీ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ కేసు విషయమై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం లభించలేదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం హాజరు కావాల్సివున్నా వంశీ రాలేదు. ఈ నేపథ్యంలో వంశీపై పోలీసులు ఫోకస్ చేశారు.