Visakhapatnam: స్నేహితుల దినోత్సవం రోజున ఆనందంగా గడపాలని భావించిన ఆ స్నేహితుల గుంపులో ఊహించని విషాదం నిండింది. సరదాగా గడపడానికి బీచ్కి వెళ్లిన ఐదుగురు మిత్రుల్లో ఇద్దరు సముద్ర అలల తాకిడికి గల్లంతయ్యారు.
తీరంలో విషాద ఛాయలు
విశాఖపట్నం పెద జాలారిపేటకు చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఆదివారం పెదగంట్యాడ మండలం పరిధిలోని పాత గంగవరం బీచ్కు చేరుకున్నారు. అక్కడ వారంతా కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీతూ అనే యువతి అలల ఉద్ధృతికి సముద్రంలో పడిపోయింది. నీతూను కాపాడేందుకు రాము అనే యువకుడు వెంటనే నీటిలోకి దిగాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
రంగంలోకి దిగిన పోలీసులు
తోటి మిత్రులు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన నీతూ, రాము కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసు సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ రోజున ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది.
Also Read: ఏపీ పొగాకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!