KK Raju: విశాఖపట్నం నగరంలో సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని కేకే రాజు తీవ్రంగా విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఎంపీ భరత్ స్వయంగా భూకబ్జాలకు పాల్పడటం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ.. వేగంగా అక్రమ కట్టడాలు నిర్మించడం చట్టాన్ని ధిక్కరించడమేనని మండిపడ్డారు.
గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో జీవీఎంసీ సమావేశంలో అక్రమ మార్గాల్లో క్రమబద్ధీకరణలు చేశారని.. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి భారీ భూ దోపిడీ ఏనాడూ జరగలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన బోర్డులను తొలగించి మరీ ఆక్రమణలు చేస్తున్నా.. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రామని తెలిసి ముందే దోచుకోవాలనే ధోరణితో కూటమి నేతలు ఉన్నారని విమర్శించారు.
అధికారుల తీరుపై కూడా కేకే రాజు నిప్పులు చెరిగారు. జీవీఎంసీ కమిషనర్కు ఐఏఎస్ ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని, అధికారులు రాజకీయ నాయకులకు బానిసల్లా వ్యవహరించడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ భూకబ్జాలపై ప్రైవేట్ కేసులు వేస్తున్నామని, ఇందులో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, ఆర్డీఓలను కూడా బాధ్యులుగా చేరుస్తున్నట్లు తెలిపారు. ఊరు పేరు లేని కంపెనీలకు వేల కోట్ల భూములను కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారని.. ఈ కుంభకోణం నుంచి విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.
Also Read:జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?