Bandi Sanjay: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గరీబోం కో హటావో-ఒవైసీ కో బచావో అన్నట్లుగా ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బండి ఆదివారం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. చెరువుల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ, ఎంఐఎం నేతలకు చెందిన అక్రమ కట్టడాలను మాత్రం రక్షిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. పేదవాడికి బఫర్ జోన్లు చూపిస్తూ బుల్డోజర్లు పంపిస్తున్న ప్రభుత్వం, ఒవైసీ సంస్థలకు మాత్రం కంఫర్ట్ జోన్లు కల్పిస్తోందన్నారు. పేదల ఇండ్ల విషయంలో ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్న అధికారులు, ఓవైసీకి చెందిన సల్కమ్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని కాలేజీ విషయంలో మాత్రం ‘ఫుల్ థ్యాంక్ లెవల్’ అన్నట్లుగా లబ్ధి చేకూరుస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు.
Also Read: Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం – 2126లో ఒళ్ళు జలదరించే సంఘటనలు జరుగుతాయట
అక్రమ కట్టడాల్లోని విద్యార్థుల భవిష్యత్తును సామాజిక కోణం పేరుతో సమర్థిస్తూ, అదే సమయంలో ఒక పేదవాడి ఇంట్లో ఉన్న పసిబిడ్డను మాత్రం ఆక్రమణదారుగా చూడటం కాంగ్రెస్ వింత లాజిక్ అని దుయ్యబట్టారు. 200కు పైగా పేద కుటుంబాల ఇళ్లను కూల్చివేసేందుకు మెరుపు వేగంతో కదిలే బుల్డోజర్లు, ఓవైసీ కాలేజీ వద్దకు వచ్చేసరికి మాత్రం సాంకేతిక కారణాలు, సాకులు చెబుతూ మొరాయిస్తున్నాయని విమర్శించారు. గౌరవప్రదమైన జీవనం కోసం ప్రధాని మోడీ పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉన్న ఇండ్లను కూల్చేస్తూ వారి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. రజాకార్ల వారసుల ముందు మోకరిల్లుతూ, పేదలపై ప్రతాపం చూపడం పాలన అనిపించుకోదని, అది కేవలం వెన్నెముక లేని బుజ్జగింపు రాజకీయమని బండి సంజయ్ విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, కేవలం పేదల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అక్రమాలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా కర్ణాటకలోని శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి అనంత భారతీ తీర్థ మహాస్వామి 76వ జయంతిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామీజీ నిర్వహించిన పలు ప్రత్యేక పూజల్లో సంజయ్ కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పీఠాధిపతి జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణం లో విధుశేఖర భారతి స్వామీజీ నిర్వహించిన సహస్ర నారికేళ హవనం మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలోనూ కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సహస్ర నారికేళ హవనం యజ్ఞం ప్రాసస్త్యం గురించి శృంగేరి పీఠం పూజారులు మంత్రికి వివరించారు. అనంతరం బండి సంజయ్ శృంగేరి శారదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠ తెలంగాణ బాధ్యులు వ్యాసోజల రాధాకృష్ణ శర్మ కూడా పాల్గొన్నారు.
Also Read: CPI Narayana: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ