ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్యకాలం చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆయనకు అధికారం పిచ్చి పట్టుకున్నదని కొందరు అంటుంటే.. తానింకా అధికారంలోనే ఉన్నాననే భ్రమలో జగన్ ఉన్నాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు జగన్కు ఏం కావాలి? అధికారం మీద ఆశ ఇంకా పోలేదా? ఎందుకు ఇలా ప్రతిదానికి ఎడ్డం అంటే తెడ్డం అంటున్నాడు అని సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. వైసీపీ శ్రేణులు సైతం జగన్కు వంత పాడటాన్ని కూటమి నేతలు, ఏపీ ప్రజలు సైతం జీర్ణించుకోవడం లేదని తెలుస్తున్నది. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ చేస్తున్న పోస్టులపై వారు సైతం తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లబుచ్చుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీ ప్రజలు వైఎస్ జగన్కు అధికారం ఇవ్వడానికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తున్నది. ముందుగా వైఎస్సార్ తనయుడు.అంతేకాకుండా రాజన్న రాజ్యం తెస్తాడని భావించడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ ప్రయత్నించగా.. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను అవినీతి కేసులో అరెస్టు చేయించి నానా ఇబ్బందులకు గురిచేసిందని ప్రచారం జరిగింది. ఇక ఉమ్మడి ఏపీ విడిపోయాక గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి ఆయనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు ఆశించిన అభివృద్ధి వారికి కనిపించలేదు. వాస్తవానికి రాజధాని అంశంలో కోర్టు కేసులే అభివృద్ధికి శరాఘాతంగా మారాయని టాక్.దీంతో 2019 ఎన్నికల్లో వారికి రాజన్న బిడ్డవైపు ప్రజల దృష్టి మళ్లింది. ఎన్నికల ముందు జగన్ జైలులో ఉండగా.. ఆయన పార్టీ కోసం వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ పాదయాత్ర చేపట్టారు.
ఎన్నికలకు కొద్ది నెలల ముందు జగన్ జైలు నుంచి బయటకు రావడం, రాజన్న బిడ్డ అనే సెంటిమెంట్.. రాజన్న రాజ్యం తెస్తారని ప్రజల నమ్మకం వాంటి ఫ్యాక్టర్స్తో పాటు నవరత్నాల స్కీమ్స్ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఒక్కచాన్స్ ఇద్దామని ప్రజలు ఫిక్స్ అయ్యి అధికారం కట్టబెట్టారు.అయితే, ఇచ్చిన అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకున్నారా? అంటే నో సమాధానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల పేరిట కాలయాపన, ఉచితాలకే ప్రాధాన్యత, అభివృద్ధి నిల్లు, నో జాబ్స్, విపరీతంగా అప్పులు, అవినీతి, మంత్రుల డర్టీ బిహేవియర్, పన్నుల పెంపు, విపరీత ద్రవ్యోల్బణం వలన జగన్ పాలనపై ఉద్యోగులు సైతం తీవ్ర విమర్శలు చేసిన రోజులున్నాయి. ఇవే కాక ఇంకా చాలా అంశాలు ఆయన పాలనపై ప్రజలు పెదవి విరవడానికి కారణమయ్యాయని టాక్.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయాల్సిన వచ్చినప్పుడల్లా తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.అయితే, ప్రజలు మళ్లీ జగన్ కు చాన్స్ ఇస్తారా? అంటే లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది. ముఖ్యంగా యువత జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయని, రాజధాని నిర్మాణం, పోలవరం, ఇతర పనులు వేగంగా సాగుతున్నాయని..జగన్ వస్తే మళ్లీ మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని మరింత వెనక్కి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేండ్ల కాలంలో జగన్ .. రాష్ట్రాన్ని 15 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని కొందరు మండిపడుతున్నారు. ఇటువంటి సమయంలో అధికారంలోకి వస్తానని జగన్ అనుకోవడం నిజంగా భ్రమే అని.. అందులో నుంచి త్వరగా బయటకు రావాలనని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్నది.