Constable Warning: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు తెలిపారు. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 5757 మందికి కానిస్టేబుల్ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కానిస్టేబుల్ నోటిఫికేషన్పై కేసులు వేశారని, వాటిని అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయని, వేరేవాళ్లు వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. తన హయాంలో 23 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశానన్నారు. కొత్తగా నియమితులైన 5,757 మంది కానిస్టేబుళ్లు రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన షేక్ గన్లూర్ హాఫీజున్ ఎన్నో కష్టాలు అధిగమించి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. నియామక పత్రాలు అందించిన కార్యక్రమంలో షేక్ హాఫీజున్ మాట్లాడుతూ.. ‘ముస్లిం కమ్యూనిటీలో మహిళలను పోలీస్ ఉద్యోగాలకు పంపించడానికి చాలా భయపడుతుంటారు. ఎంతో మంది ఎన్నో మాటాలు ఉన్నారు. అయినప్పటికీ నా తల్లిదండ్రులు, భర్త కృషి వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నువ్వు ముస్లిం అమ్మాయివి, మ్యారేజ్ అయింది ఇంక ఏం చేయగలవని హేళన చేశారు. నువ్వు ఏమైనా సాధించాలి అనుకుంటే బీఈడీ మాత్రమే ఉంది. టీచర్ కు ప్రిపేర్ అవ్వమని సలహాలు ఇచ్చేవారు. అలాంటి వాళ్లందరూ ఆశ్చర్యపోయేలా ఇవాళ నేను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. మా కమ్యూనిటీలో నాలా చదువుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి కొంత ఊతం ఇవ్వండి. తొందరగా పెళ్లిళ్లు చేసి వాళ్ల కలలను అణగదొక్కొద్దు’ అన్నారు.
Also Read: Ganja Cultivation: పచ్చని పల్లెల్లో.. పరిమలిస్తున్న గంజాయి
పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐపీఎస్ సర్వీసు సాధించి జిల్లాకు ఎస్పీ కావాలన్నారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ.. తన ఊరికి రోడ్డు వేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ఆ బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.