Madhavaram Krishna Rao: ఐడీపీఎల్ (IDPL) భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 4 వేల కోట్ల విలువైన ఈ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఐడీపీఎల్ పరిధిలోని సర్వే నెంబర్ 376లో జరిగిన ఆక్రమణలు, అక్రమాలపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఎమ్మెల్సీ కవిత భర్త ఐడీపీఎల్ భూమిని కబ్జా చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించడం, దీనిని కవిత ఖండించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న విజిలెన్స్ విచారణ నిర్ణయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. ఐడీపీఎల్ భూములపై విచారణ జరపాలని తానే స్వయంగా ప్రభుత్వాన్ని కోరానని, తన విజ్ఞప్తికి స్పందించి విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 20 ఏళ్లుగా తనపై రాజకీయ దురుద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఇప్పుడు ఆ ఆరోపణలను నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ విచారణతో ఎవరెవరు ఆక్రమణలకు పాల్పడ్డారనే విషయంలో ఒక స్పష్టత వస్తుందని అన్నారు.
ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై కేవలం విజిలెన్స్ మాత్రమే కాకుండా, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీబీఐ విచారణ జరిపించాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తాను గతంలోనే డిమాండ్ చేసినట్లు కృష్ణారావు గుర్తుచేశారు. అధికారుల తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని, కానీ శేరిలింగంపల్లిలో కబ్జాకు గురైన ఖరీదైన స్థలాలను మాత్రం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Read Also: Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..