Janasena: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాజకీయాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజాన సూర్యచంద్రపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే నర్సీపట్నం జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర తనను గత 12 ఏళ్లుగా వివాహం చేసుకుంటానని నమ్మించి, మోసం చేస్తున్నాడని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో ఇన్నేళ్లుగా తనను వాడుకుని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం నమ్మకద్రోహమే కాకుండా, సూర్యచంద్ర తనపై, తన తండ్రిపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ వివాదంలో మొబైల్ ఫోన్ కీలకాంశంగా మారింది. రాత్రి సమయంలో తమ ఇంటికి వచ్చిన సూర్యచంద్ర, తన వద్ద ఉన్న సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నాడని లావణ్య తండ్రి ఆరోపించారు. ఆ ఫోన్లో సూర్యచంద్రకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగత ఆధారాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయనే ఉద్దేశంతోనే, వాటిని నాశనం చేసేందుకు ఆయన దాడికి తెగబడ్డారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తండ్రీ కూతుళ్లకు గాయాలైనట్లు సమాచారం.
అయితే, ఈ వ్యవహారంలో ఒక అనూహ్య మలుపు చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే లావణ్య తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. సూర్యచంద్ర అనుచరుల నుండి లేదా ఆయన నుండి వచ్చిన తీవ్రమైన బెదిరింపుల వల్లే ఆమె భయపడి కేసు ఉపసంహరించుకుందని స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు అండగా ఉండాల్సిన నాయకుడే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసు మాఫీ చేయించడమేమిటని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
కేవలం మహిళా వేధింపులే కాకుండా, సూర్యచంద్రపై నాతవరం పరిసర ప్రాంతాల్లో అనేక ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, పవిత్రంగా భావించాల్సిన జనసేన నియోజకవర్గ కార్యాలయంలోనే మద్యం సేవించి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు గానీ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గానీ స్పందించకపోవడం గమనార్హం.
Also Read: నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, కంటైనర్ ఢీ.. స్పాట్లో నలుగురు మృతి
ఈ పరిణామాలపై నర్సీపట్నం నియోజకవర్గంలోని జనసేన నాయకులు, నిజాయితీ కలిగిన కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే జనసేన పార్టీలో ఇలాంటి వ్యక్తులకు ఇంచార్జ్ పదవి ఇవ్వడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వెంటనే సూర్యచంద్రపై విచారణ జరిపి పార్టీ నుండి బహిష్కరించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.