Pawan Kalyan Speech In Pithapuram: అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు కానీ పిఠాపురం ప్రజలు దాన్ని బద్దలు కొట్టి డిప్యూటీ సీఎంను చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో వర్మ మాటలు నిజమయ్యాయన్నారు. పిఠాపురంలో బుధవారం సాయంత్రం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభలో ప్రసంగించారు. పిఠాపురం ప్రజల గురించి దేశప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఒక్కడి కోసం దేశప్రజలు మాట్లాడుకునేంతటి ఘనవిజయాన్ని అందించారని అందుకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాని పవన్ కళ్యాణ్ అన్నారు.
డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్నవారికి అండగా నిలవాలనుకున్నానని.. కానీ పిఠాపురం ప్రజలు ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు. అసలు దేశంలో ఇప్పటివరకు 100 శాతం స్ట్రైక్ రేట్ చూడలేదని అన్నారు పవణ్ కళ్యాణ్.
అసెంబ్లీ గేటు తాకనీయమన్నారని.. కానీ వర్మ గేటు తాకడమేంటి బద్దలుకొట్టుకుని వెళ్తారని వర్మ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఆ మాటలను పిఠాపురం ప్రజలు నిజం చేశారన్నారు. చాలా మంది తనని హోం శాఖ తీసుకోమన్నారని కానీ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం తాను పంచాయితీరాజ్ శాఖ తీసుకున్నానని చెప్పారు. అసలు లంచాలు తీసుకోనని.. నిధులు సద్వినియోగం కావాలన్నారు. ప్రజలు కట్టే ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నానని పేర్కొన్నారాయన.
ఇక ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్.. ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారని అన్నారు. 151 స్థానాలున్న వైసీపీ కేవలం 11 స్థానాలకు పడిపోయిందన్నారు. వైసీపీని ఓడించాలనే కసితో బస్సుల్లో, రైళ్లలో వచ్చి మరీ ఓటేసి వెళ్లారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు పవన్. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరికీ ఇంత మెజార్టీ రాలేదని అన్నారు .