Guntur: ఏపీలో కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న భూ లావాదేవీల్లో సీతారాం కాగా, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా వంతైంది. పొగాకు వ్యాపారి కొడుకు కిడ్నాప్ కేసులో ముస్తఫాతోపాటు ఆయన కొడుకు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా సెల్పీ వీడియో రిలీజ్ చేశారు. అసలేం జరిగింది?
పొగాకు వ్యాపారి కొడుకు కిడ్నాప్ కేసు-ఏపీలో పొగాకు వ్యాపారి కొడుకు కిడ్నాప్ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. నూజివీడులో సోమవారం అర్థరాత్రి ఓ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. కోయిలగూడెం నుంచి గుంటూరుకు పొగాకు లోడు వాహనాన్ని నూజివీడులో ఓ పెట్రోల్ బంకు వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కొడుకు బషీర్, అతడి అనుచరులు అడ్డుకున్నట్లు ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత వాహనంలోని పొగాకు వ్యాపారి కొడుకు, వాహనం డ్రైవర్ను కిడ్నాప్ చేసి గుంటూరులోని ఓ గెస్ట్ హౌస్లో నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి.
కష్టాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కొడుకు-ఈ విషయం తెలియగానే బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారి కొడుకు, డ్రైవర్ను సురక్షితంగా రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బషీర్పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసుతో ప్రమేయమున్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కొడుకు బషీర్లను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కిడ్నాప్ సమయంలో ముస్తఫా మాట్లాడిన కాల్ డేటాను పోలీసులు సేకరించినట్లు సమాచారం.
ముస్తఫా సెల్ఫీ వీడియో రిలీజ్- పరిస్థితి గమనించిన మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సెల్ఫీ వీడియా రిలీజ్ చేశారు. సూర్యచంద్రరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. గొడవలు పడే మనస్తత్వం తనది కాదన్నారు. పొగాకు కోనుగోళ్ల కోసం తన దగ్గర డబ్బులు తీసుకుని వేరేవాళ్లకు అమ్ముతుంటే తన సిబ్బంది అడ్డుకుని స్టాక్ను తీసుకుని పోలీసులకు అప్పగించాలని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని చెబితే, మాపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై పోలీసులతో తాను మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు.
ALSO READ: నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్-ఎల్లో అలర్ట్, హైదరాబాద్లో కూడా
పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఏ రోజూ తనపై ఆరోపణలు, వివాదాలు లేవన్నారు. ఇప్పుడు కిడ్నాప్ అంటూ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సూరిబాబుకు మాకు ఎలాంటి లావాదేవీలు లేవని, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతామన్నారు. ఈ విషయంలో సీఐ తనకు ఫోన్ చేస్తే, ఆయనకు అదే మాట చెప్పాలని గుర్తు చేశారు.