ఏపీలో ప్రతిపక్ష వైసీపీ అధికార పార్టీని ఢీ కొట్టేందుకు వేస్తున్న ప్రణాళికలు అన్ని బెడిసికొడుతున్నట్టు తెలుస్తోంది.ఇదే విషయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహరంపై చర్చ జరపాలని ప్రతిపక్ష వైసీపీ పదే పదే డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే ఒకసారి అసెంబ్లీలో చర్చకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు.ప్రతిపక్షాలకు ఉన్న అనుమానాలపై మంత్రులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినా వారి తీరులో మార్పు రాలేదు. ఇప్పటికే అసెంబ్లీ సెషన్స్ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుపడటంపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.
వైసీపీ ముందు నుంచి అధికార పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నది.రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా అందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బాధ్యులను చేస్తూ విమర్శలు చేస్తున్నది. ఏమైనా అంటే కూటమి సర్కార్ ‘మా గొంతు నొక్కుతున్నది’ అని డైలాగ్ కొడుతున్నదని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.తిరుమల లడ్డూ వ్యవహారం, కల్తీ పాల ఘటన, మాజీ మంత్రుల పేర్నినాని, అంబటి రాంబాబు ఇండ్ల మీద దాడులు, క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు వంటి ఘటనల్లో ప్రభుత్వానిదే తప్పు అని, నిర్లక్ష్యమని విమర్శలు చేస్తూ వచ్చింది.
ఇదిలాఉంటే రాష్ట్రంలో ఏదైనా చెడు ఘటన జరిగితే అందుకు బాధ్యత ప్రభుత్వానికి అన్నప్పుడు.. మంచి జరిగితే ఆ క్రెడిట్ మాత్రం వైసీపీ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు కరెక్టు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. గతంలో రాయలసీమ లిఫ్ట్, భోగాపురం ఎయిర్ పోర్టు ఘటనల్లో ఈ క్రెడిట్ అంతా వైసీపీకే చెందుతుందని, తమ హయాంలోనే వీటికి అడుగులు పడ్డాయని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ విమానం విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో వైసీపీ పెద్దఎత్తున ఇదంతా తమ ప్రభుత్వ ఘనతే అని ప్రచారం చేసుకున్నది. జగన్ హయాంలో ఎయిర్ పోర్టు పనులు 80 శాతం పూర్తి అయ్యాయని చెప్పుకున్నది. ఇక రాయలసీమ లిఫ్ట్ పనులు, నిధుల కేటాయింపులు సైతం జగన్ హయాంలోనే అధికంగా జరిగాయని ప్రచారం చేసుకున్నది.
Mahesh Kumar Goud: డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు
కాగా, గత ప్రభుత్వం హయాంలో సగం వరకు పనులు చేసి వదిలిస్తే…దానిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి క్రెడిట్ చెందదా? తామే చేశామని ప్రచారం చేసుకోవడం తప్పా? సగం చేసిన మీరే ప్రచారం చేసుకున్నప్పుడు.. మొత్తంగా నిధులు కేటాయింపు, నిరంతర పర్యవేక్షణ, కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తేవడం వంటివి చేసిన ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు క్రెడిట్ తీసుకోకూడదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు వేస్తే ‘మా గొంతు నొక్కుతున్నారని’ అనడం వైసీపీ నేతలకు అలవాటు అయ్యిందని కూటమి నేతలు మండిపడుతున్నారు. సగం సగం పనులనే మీరు అభివృద్ధి అని చెప్పుకుంటే.. పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు మేలు కలిగేలా అందుబాటులోకి తీసుకురావడం అభివృద్ధి కాదా? దీనిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.