E-Paper
Advertisement

Yellapragada Subbarao : ఎల్లాప్రగడ సుబ్బారావు.. నోబెల్ దక్కాల్సిన తెలుగోడు..!

Yellapragada Subbarao : ఎల్లాప్రగడ సుబ్బారావు.. నోబెల్ దక్కాల్సిన తెలుగోడు..!

Yellapragada Subbarao : ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు.. తమ మేధస్సును రంగరించి, చేసిన ఆవిష్కరణలే మన ప్రపంచాన్ని ఎప్పటికప్పడు కొత్త బాట పట్టిస్తున్నాయి. అలాంటి శాస్త్రవేత్తల్లో మన తెలుగువాడైన ఎల్లాప్రగడ సుబ్బారావు అగ్రగణ్యులు. భారతీయ శాస్త్ర జ్ఞానంపై అపారమైన నమ్మకంతో వైద్యరంగంలో ఆయన చేసిన పరిశోధనలు.. ఎన్నో ఔషధాలను మానవాళికి అందించాయి. వర్ణ వివక్ష కారణంగా నోబుల్ పురస్కారం దక్కాల్సిన ఈ శాస్త్రవేత్త.. ఏ గౌరవాన్ని అందుకోకుండా ఈ లోకం నుంచి నిష్ర్కమించినా, ఆయన కనిపెట్టిన ఔషధాలు మాత్రం నేటికీ కోట్లాదిమందికి ప్రాణభిక్ష పెడుతూనే ఉన్నాయి.

ఎల్లాప్రగడ సుబ్బారావు నాటి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న నేటి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1895 జనవరి 12న జన్మించారు. జగన్నాథం, వెంకమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో సుబ్బారావు నాలుగో సంతానం. 18 ఏళ్లకే తండ్రిని కోల్పోయారు. ఈయన ఇద్దరు సోదరులూ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఈయన ఆరోగ్యమూ అంతంతమాత్రంగా ఉండేది. తండ్రి మరణం తర్వాత అనారోగ్యానికి తోడు ఆర్థిక సమస్యలూ తోడయ్యాయి. దీంతో రెండుసార్లు మెట్రిక్యులేషన్‌ తప్పారు.

తల్లి నగలు అమ్మగా వచ్చిన సొమ్ము, స్నేహితుల ఆర్థిక సాయంతో.. మద్రాసులోని హిందూ హైస్కూల్‌లో చదివిన సుబ్బారావు.. మూడో దఫాలో మెట్రిక్ పాసయ్యారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్‌‌ చదివిన సుబ్బారావు.. గణితంలో డిస్టింక్షన్‌ సాధించారు. దీంతో అందరూ గణితంలోనే డిగ్రీ చేయమన్నారు. కానీ.. సుబ్బారావు చదువుకు స్వస్తి చెప్పి.. రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారాలనుకున్నారు. కానీ.. తల్లి, మఠం నిర్వాహకులు నచ్చజెప్పటంతో ఆయన దృష్టి వైద్య విద్యపై ఆకర్షితులయ్యారు. అలా మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో చేరారు. కానీ.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోయే పరిస్థితి తలెత్తిన పరిస్థితిలో ‘మా అమ్మాయిని పెళ్లాడతానంటే.. ఆ డబ్బు నేనే ఇస్తాను’ అని కస్తూరి సూర్యనారాయణ ముందుకు రావటంతో ఆయన కుమార్తె శేషగిరిని పెళ్లి చేసుకున్నారు.

స్కూలు విద్యార్థిగా కొన్నాళ్లు రాజమండ్రిలో ఉన్న సుబ్బారావు.. నాటి స్వాతంత్ర సమరయోధుల ప్రసంగాలు వినేవాడు. అయితే.. సుబ్బారావు వైద్య విద్యార్థిగా ఉండగా మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా విదేశీ వస్తువులు వద్దనీ, ఖద్దరు కట్టాలని పిలుపునిచ్చారు. జాతీయ భావాలు కలిగిన సుబ్బారావు.. మర్నాడు ముతక ఖద్దరుతో చేసిన సర్జికల్ ఏప్రాన్ ధరించి.. మెడికల్ కాలేజీకి వెళ్లారు. దీంతో అక్కడి సర్జరీ విభాగపు హెడ్.. బ్రిటిష్ జాతీయుడైన ఎం.సీ. బ్రాడ్ ఫీల్డ్‌కు కోపాన్ని తెప్పించింది. ‘మీ గాంధీ దేశానికి వైశ్రాయ్ అయిన తర్వాత దీన్ని ధరించుదువులే’ అని అందరి ముందూ ఎగతాళి చేశాడు. గాంధీజీని అవమానించటంతో తట్టుకోలేకపోయిన సుబ్బారావు అంతే రోషంగా.. ‘మా గాంధీజీ ఏనాటికీ మీ వైశ్రాయ్ స్థాయికి దిగజారడు’ అని క్లాసు రూమ్‌లో అనటంతో బ్రాడ్‌ఫీల్డ్.. సుబ్బారావు మీద కక్ష గట్టాడు.

చదువులో పెద్ద నైపుణ్యం సాధించలేదనే కారణం చూపుతూ.. సుబ్బారావుకు డాక్టర్ పట్టాకు బదులుగా దాని తర్వాతి స్థాయి ఎల్ఎంఎస్ పట్టాను ప్రదానం చేశారు. అయినా సుబ్బారావు నిరాశ పడకుండా.. ఆయుర్వేదం మీద దృష్టి పెట్టారు.

ఆయనకు ఎంబీబీఎస్ పట్టా ఇవ్వకుండా అంతకన్నా తక్కువదైన ఎల్‌ఎంఎస్‌ సర్టిఫికెట్‌తో సరిపుచ్చారు. మద్రాస్‌ మెడికల్‌ సర్వీస్‌లో ఉద్యోగానికి ఇది ఆటంకమైంది. అయితే.. బ్రాడ్‌ఫీల్డ్‌ పుణ్యామా అని వైద్య వృత్తి పట్టా దక్కని సుబ్బారావు ఆయుర్వేదంపై దృష్టిసారించారు. గతంలో ‘ఉష్ణమండల స్ప్రూ’ అనే రోగం బారిన పడ్డ సుబ్బారావుకు స్థానిక ఆయుర్వేద వైద్యుడైన లక్ష్మీపతి ఇచ్చిన మందు పనిచేసింది. దీంతో ఆయుర్వేదం మీద ఆసక్తి పెరిగి, మద్రాసులో లక్ష్మీపతి నిర్వహించే ఆయుర్వేద కాలేజీలో అనాటమీ లెక్చరర్‌గా చేరి, పరిశోధనలు ఆరంభించారు.

సరిగ్గా.. ఆ సమయంలో భారత్‌కు వచ్చిన అమెరికన్‌ వైద్యుడు జాన్‌ ఫాక్స్‌ కెండ్రిక్స్‌.. సుబ్బారావు మేధస్సును గుర్తించి, విదేశాల్లో పరిశోధన చేయమని సూచించారు. అప్పట్లో అందరూ పైచదువుల కోసం బ్రిటన్ వెళుతున్నా.. భారతీయులను పీడిస్తున్న బ్రిటన్‌కు బదులు.. అమెరికాలోని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో అడ్మిషన్‌కు దరఖాస్తు చేశారు. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో డిప్లొమాలో ఫిజీషియన్‌కి బదులు కెమిస్ట్‌ కోర్సుకి అడ్మిషన్‌ వచ్చింది. మల్లాడి సత్యలింగనాయకర్‌ చారిటీస్‌ (కాకినాడ) వారి సాయంతో 1923 అక్టోబరులో సుబ్బారావు అమెరికా చేరి, కోర్సు పూర్తి చేశాక జూని యర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉద్యోగం ఇచ్చారు.

అప్పట్లో ఆయనకు హార్వర్డ్‌ యూని వర్శిటీలో కేవలం 2,700 డాలర్ల జీతం మాత్రమే. ఒక్కసారిగా పెద్ద అవకాశం. అందులో చేరితే అప్పులన్నీ తీరిపోతాయి. ఎగిరి గంతేయాలి కానీ ఎక్స్‌పెరిమెంట్స్‌ కోసం బిల్డింగ్‌ ఇచ్చే మాటైతే సగం జీతానికే పని చేస్తానని సుబ్బారావు కోరారు. రీసెర్చి అంటే ప్రాణం పెట్టే లీడర్లీ ప్రెసిడెంట్‌ విలియం బ్రౌన్‌బెల్‌ కొత్త బిల్డింగూ ఇచ్చాడు, ఆఫర్‌ చేసిన జీతమూ ఇచ్చాడు. హార్వర్డ్‌లోనే పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ సాధించారు. టెట్రాసైక్లిన్‌ యాంటీ బయాటిక్‌, ఫైలేరియా(బోదకాలు) నివారణకు హెట్రజన్‌, టీబీ(క్షయ) కట్టడికి ఐసోనికోటినిక్‌ ఆసిడ్‌ హైడ్రాజైడ్‌, కేన్సర్‌ చికిత్సలో భాగంగా వాడే కీమోథెరపీ ఔషధాల్లో తొలితరం డ్రగ్‌ మెథోట్రెస్సేట్‌ను… సిడ్నీ ఫార్బర్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు.

ఇన్ని అద్భుత ఆవిష్కరణలు చేసినప్పటికీ డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావుకు నోబెల్‌ బహుమతి దక్కలేదు. ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకెళ్లి పరిశోధనలు చేసిన శిష్యులకు మాత్రం ఆ పురస్కారాలు లభించడం గమనార్హం. 1948 ఆగస్టు 9న 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఎల్లాప్రగడ సుబ్బారావు అమెరికాలోనే కన్నుమూశారు. అమెరికా రచయిత డోరోన్‌ ఆంట్రిమ్‌ మాటల్లో చెప్పాలంటే.. “ఈ తరంలో చాలామంది సుబ్బారావు పేరు విని ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆయన జీవించి ఉండటం వల్లే నేడు మనమంతా ఆరోగ్యంగా, సజీవంగా ఉంటున్నాం’ అనే అమెరికన్ రచయిత డోరోన్ ఆంట్రిమ్ మాటలను బట్టి ఆయన ఎంత గొప్ప పరిశోధకుడో మనకు అర్థమవుతుంది.

yellapragada subbarow biography, Yellapragada subbarao, yellapragada subbarow birth anniversary

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×