YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని, నారాసుర పాలన పరాకాష్టకు చేరి అరాచకం రాజ్యమేలుతోందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.
విరూపాక్షి అరెస్టుపై తీవ్ర ఆగ్రహం
ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. చిప్పగిరి మండలం నేమకళ్లులో వైయస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేస్తే.. కాపాడటానికి వెళ్లిన ఎమ్మెల్యేపైనే తిరుగు రాళ్లదాడి చేశారన్నారు. అంతేకాకుండా, బాధితులకు అండగా నిలిచినందుకే అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఆయనను, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పోలీసుల దౌర్జన్యం బయటపడకూడదనే ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్కులను కూడా మాయం చేశారని ఆరోపించారు.
వరుస అక్రమ కేసులు, కక్షసాధింపులు
శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని జగన్ గుర్తుచేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న ప్రజలను చూసి భయపడి చింతాడ రవికుమార్తో పాటు పలువురి పై దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. అలాగే గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపై కూడా అబద్ధపు కిడ్నాప్ కేసు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అర్ధరాత్రి వేళ దౌర్జన్యాలు చేయడం రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ ఉందా అనే అనుమానాన్ని కలిగిస్తోందన్నారు.
Also Read: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్లోనే ఐదుగురు మృతి!
వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే కుట్ర
రాష్ట్రంలో Gen-Z తరం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తోందని జగన్ తెలిపారు. డీఎస్సీ-2025 అక్రమాలు, విద్యాదీవెన బకాయిలు, నెలకు ఇచ్చే రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీల అమలుపై యువత లోకేష్ను నిలదీస్తోందని చెప్పారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే చంద్రబాబు ప్రభుత్వం ప్రజా దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అక్రమ అరెస్టులు, పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతోందని స్పష్టం చేశారు.
అధికారం శాశ్వతం కాదు
అధికారం, పోలీసు బలం ఎప్పటికీ శాశ్వతం కావని చంద్రబాబును జగన్ హెచ్చరించారు. ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా, తలుపులు బద్దలు కొట్టినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై పోరాడుతూనే ఉంటుందని, బాధితులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Also Read: మైసూరులో విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కుర్కురే!