ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర ప్రస్తావన తెచ్చారు.ఏపీలో దీనికి చాలా క్రేజ్ ఉంది. గతంలో ఆయన తండ్రి,దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పాదయాత్ర చేసే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన హయాంలో అమలైన సంక్షేమ పథకాల కారణంగా మరోసారి ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇక 2019 ఎన్నికల ముందు సైతం జగన్ జైలులో ఉన్నప్పుడు ముందుగా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టారు. జగన్ విడుదల కాగానే దాన్ని జగన్ కొనసాగించారు. దీనికి తోడు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలు స్కీమ్స్ ఆయన్ను ప్రజల వద్దకు చేరువ చేశాయి. ఫలితంగా అధికారంలోకి వైసీపీ పార్టీ వచ్చింది.
జగన్ గత ఐదేండ్ల పాలనలో ఏం చేశారంటే కేవలం బటన్ నొక్కామా? డబ్బులు ప్రజల ఖాతాల్లో వేసామా? ఇంతే.. విద్యారంగం అభివృద్ధికి ఆయన కొంత కృషి చేశారని పేరొచ్చినా అదొక్కటే ఆయన అధికారాన్ని నిలబెట్టలేకపోయింది. సంక్షేమం మత్తులో ఉండిపోయిన జగన్.. అభివృద్దిని గాలికొదిలేశారని ప్రజల నుంచే భారీగా విమర్శలొచ్చాయి. ఇక ఓవైపు ఉచితంగా రూపాయి పంపిణీ చేసిన జగన్.. ప్రజల నుంచి రూ.5 వరకు వసూలు చేశారని సైతం గతంలో విమర్శలొచ్చాయి. తీరా చూస్తే కేవలం ఒక్ టర్ముకే జగన్ పాలనపై ఏపీ ప్రజలకు చిరాకు వచ్చేలా చేసుకున్నారు.
జగన్ హయాంలో కేవలం జిల్లాల స్థాయిలో బటన్ నొక్కి ఏడాదికొసారి, ఆరునెలలకోసారి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామా? అని వైసీపీ అధినాయకత్వం ఆలోచించింది తప్పా.. మరి అభివృద్ధి, సంక్షేమం సమపాలలో జరుగుతున్నదా? లేదా అని ఆలోచించలేదని ఆరోపణలు ఉన్నాయి. రాజధాని అమరావతి మూలకు పెట్టేశారు. మూడు రాజధానుల పేరిట ఐదేండ్ల పాటు కాలయాపన చేశారని విమర్శలు వచ్చాయి. ఇక ఉద్యోగులను సైతం జగన్ పెద్దగా పట్టించుకోలేదని.. ఇష్టానుసారంగా పన్నులు పెంచుకుంటూ వెళ్లారని.. గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని.. గిరిజిన గ్రామాల్లో రోడ్లు, మంచి నీటి వసతిని కల్పించలేకపోయారని ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపించారు.
CM Revanth Reddy: పెట్టుబడుల వేటలో సీఎం.. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో కీలక భేటీ!
ఉచితాల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచారని ప్రజలే ఆయన్ను చీదరించుకునే స్థాయికి చేరుకున్నారు. ఫలితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. అయితే, 2019లో తనకు కలిసి వచ్చిన పాదయాత్ర సెంటిమెంట్ను మళ్లీ రగిలించాలని జగన్ చూస్తున్నట్టు తెలుస్తున్నది. కూటమి ప్రభుత్వాన్ని ఇంకా మూడేండ్ల సమయమే ఉందని.. ఇప్పటికే ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయ్యిందని..నిన్న ఏలూరు నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడారు. ఏడాది తర్వాత పాదయాత్రను ఏలూరు నుంచే ప్రారంభిస్తానని.. ప్రజల్లోనే ఉంటానని జగన్ తమ పార్టీ నేతలకు భరోసానిచ్చినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం జగన్కు కుటుంబం నుంచి కూడా మద్దతు దొరికేలా కనిపించడం లేదు. మరోవైపు సీబీఐ కేసులు వెంటాడుతున్నాయి. ఈసారి ఎన్నికల ముందు ఆయన జైలుకు వెళితే పార్టీ భవిష్యత్ ఏంటనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది. ఇదే విషయంపైనా వైసీపీ శ్రేణులు సైతం ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.