ఏపీలో మరోసారి రాజధాని అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతమున్న కూటమి ప్రభుత్వం అమరావతి ఏపీ రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలని చూస్తున్నది. వచ్చే అసెంబ్లీ సెషన్స్లో బిల్లు పెట్టి దాన్ని చట్టంగా ఆమోదించాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అందుకు వేగంగా అడుగులు పడుతున్న సమయంలో మరోసారి మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఏపీ ప్రజలు మరోసారి ఆలోచనలో పడ్డారు. రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా? అని అయోమయంలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వచ్చేసారి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు, జగన్ చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు చాన్స్ ఇవ్వాలిగా అనే టాక్ కూడా వినిపిస్తున్నది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి నిరాకరించారు.అది రాజధానిగా పనికి రాదని అభివృద్ధి అనేది అన్ని జిల్లాలకు సమానంగా ఉండేలా మూడు రాజధానులను ప్రతిపాదించారు. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను డెవలప్ చేస్తే .. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం ఏపీకి రాజధాని లేకుండా పోయిందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయశాఖ రాజధానిగా, అమరావతిని పరిపాలన రాజధానిగా చేస్తానని చెప్పారు. కానీ,ఐదేండ్ల పాటు ఆయన రాజధాని లేకుండానే పాలన సాగించారు.దీనివలన ఏపీకి పెట్టుబడులు లేక అభివృద్ధి కుంటుపడింది. ఇదిలాఉండగా, అమరావతి చుట్టూ టీడీపీ నేతలు భూములు కొన్నారని, చంద్రబాబు అందుకే అక్కడ రాజధాని ప్రతిపాదించారని పలుమార్లు ఆరోపించారు.
త్వరలోనే మరల వైసీపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక నిన్న ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని కామెంట్స్ చేశారు. సీఎం ఎక్కడ ఉంటే దానినే రాజధానిగా పరిగణించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం అమరావతి నదీ గర్భంలో ఉందని, భవిష్యత్లో కృష్ణా నదికి వరదలు వస్తే రాజధానికి ముప్పు తప్పదు అనే రేంజ్లో వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. పెట్టుబడిదారులను భయపెట్టేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు.
అంతేకాకుండా చంద్రబాబు తన ఇంటికి దగ్గరలో రాజధానిని నిర్మించుకుంటున్నారని కూడా మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపైనా మంత్రులు మండిపడుతున్నారు. ఏపీ అభివృద్ధి కోసమే అన్ని జిల్లాల వారికి రాజధాని అందుబాటులో ఉండాలనే అమరావతి వద్ద రాజధానిని చంద్రబాబు ప్రతిపాదించారని.. దానికి కేంద్రం కూడా ఓకే చెప్పిందని.. కేంద్ర ప్రభుత్వం కంటే జగన్ ఆలోచన గొప్పదా? అని మంత్రులు ఏకిపారేశారు. కాగా, జగన్ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే ఆయనకు మరోసారి అధికారం దక్కితే రాజధాని అమరావతి మార్పు తప్పదని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి నేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.