దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ రాజకీయ వేడిని రాజేసింది. స్పీకర్ వెలువరించిన తీర్పును తప్పుబడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు.
దానం నాగేందర్ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో సభ్యుడిగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. స్పీకర్ తీర్పును విశ్లేషించే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుందని కేటీఆర్ వాదించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్
కేటీఆర్ విమర్శలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తీర్పు ప్రతిని పూర్తిగా చదవకుండానే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో తనపై ఎన్నో విమర్శలు వచ్చినా సంయమనం పాటించానని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనను విమర్శించడం సరికాదని హితవు పలికారు.
కేటీఆర్ తీరును తప్పు బట్టిన మంత్రి పొంగులేటి
కేటీఆర్ వైఖరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుబట్టారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానించడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో పార్టీ మారడాన్ని ప్రోత్సహించిన చరిత్ర మీది కాదా అని సూటిగా ప్రశ్నించారు. సీనియర్ నాయకులు కట్టుకథలు అల్లుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
స్పీకర్ పదవిని తక్కువ చేసి మాట్లాడొచ్చా..?
సభా మర్యాదలను విస్మరించి రాజ్యాంగబద్ధమైన పదవిని తక్కువ చేసి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి చేటని మంత్రి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కేటీఆర్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. పార్టీల మధ్య ఫిరాయింపుల అంశం మరోసారి తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది.