వైసీపీ నేత, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని కొంతమంది ధ్వంసం చేశారు. ఇంట్లో కనపడిన వస్తువుని కనపడినట్టు విరగ్గొట్టారు. చివరకు కారుని కూడా తిరగతిప్పి అవతలపడేశారు. ఇటీవల కాలంలో ఏపీలో ఎవరి ఇంటి మీద కూడా ఈ స్థాయిలో దాడి జరగలేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఘటనపై వైసీపీ నేతల్లో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. సాక్షాత్తూ జగన్ కూడా నేరుగా స్పందించలేదు. నల్లపురెడ్డికి ఫోన్ చేసి దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారని సాక్షి మీడియాలో వార్తలిచ్చారు కానీ, జగన్ ఆ దాడిని ఖండించారని, రెడ్ బుక్ పేరెత్తి కూటమి పాలనను విమర్శించారని కూడా ఎక్కడా లేదు. పోనీ జగన్ ఏమైనా అజ్ఞాతంలో ఉన్నారా అంటే అదీ కాదు. ఆయన ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాకు దగ్గరగానే ఉన్నారు. కానీ నల్లపురెడ్డి గొడవపై ఆయన స్పందించలేదు. కారణం ఒక్కటే. అక్కడ ప్రసన్న చేసిన తప్పు స్పష్టంగా కనపడుతోంది. ప్రసన్న వ్యాఖ్యలకు అది కరెక్ట్ సమాధానం అని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా జగన్ మాట్లాడి ఉంటే కచ్చితంగా ఆ తప్పుని ఆయన సపోర్ట్ చేసినట్టవుతుంది. అందుకే జగన్ సైలెంట్ అయ్యారు. ప్రసన్న నీఛపు వ్యాఖ్యల్ని పరోక్షంగా తప్పుబట్టారు.
కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఏ దాడి జరిగినా దాన్ని రెడ్ బుక్ కి లింక్ పెడుతూ మాట్లాడేవారు. వైసీపీ నేతలపై ఎవరు దాడి చేసినా, అది కూటమి ప్రోద్బలంతో జరిగిందేనని విమర్శించేవారు. కానీ మాజీ మంత్రి ఇంటిపై జరిగిన దాడి విషయంలో మాత్రం జగన్ ఇంకా నోరు తెరవకపోవడం ఇక్కడ విశేషం. పొరపాటున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ సమర్థిస్తూ మాట్లాడితే జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయనకు అర్థమైంది. ఇప్పటికే అమరావతి మహిళల విషయంలో తప్పుడు వ్యాఖ్యలు వైసీపీకి తిప్పలు తెచ్చాయి. ఆ తర్వాత కవర్ చేసుకోలేక నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు మరోసారి మహిళను, స్వయానా మహిళా ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడారు వైసీపీ నేత. దీంతో ఆ వ్యాఖ్యలను సమర్థించేందుకు ఎవరూ సాహసించట్లేదు. వైసీపీ స్థానిక నేతలు మాత్రం రచ్చ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకెవరూ ఆయన్ను సమర్థిస్తూ ప్రెస్ మీట్లు పెట్టలేదు.
ప్రశాంతి రెడ్డి స్పందన..
రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రసన్న కుమార్ రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి సంస్కారం లేని నాయకుడిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. తనపై చేసిన వ్యాఖ్యలకు గాను ప్రసన్నపై ఆమె నెల్లూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటిపై జరిగిన దాడికి తమకు సంబంధం లేదని, సింపతీ కోసమే ఆయనే దాడి చేయించుకుని ఉంటారని మండిపడ్డారు.
ఇది జంగిల్ రాజ్ కాదు..
వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ వేశారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని, కనీస ఇంగితజ్ఞానం ఉండాలని ఆయన చెప్పారు. తల్లి, చెల్లిని తరిమేసిన అధినేత జగన్ ని ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారని మండిపడ్డారు. మహిళల జోలికి వచ్చినా, ఆడవారిపై అవాకులు చెవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదన్నారు లోకేష్.
#ShameOnYCP#WeStandWithPrashantiReddy
వైసిపి నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదు. కనీస ఇంగితజ్ఞానం ఉండాలి. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణం. త… pic.twitter.com/Uc1rhtWfWZ— Lokesh Nara (@naralokesh) July 8, 2025
నోటి వదరు..
మహిళలను కించపరచే నోటి వదరు ఆ పార్టీని వదల్లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు పవన్. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి అని ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు పవన్. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీ నేతలు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, నిండు శాసనసభలో కూడా అలానే మాట్లాడటంతో గత ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో తీర్పునిచ్చారని గుర్తు చేశారు పవన్. అయినా వారికి బుద్ధిరాలేదని, మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు.
మహిళలను కించపరచే నోటి వదరు ఆ పార్టీని వదల్లేదు
•కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి
మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. కోవూరు శాసనసభ్యురాలు…
— JanaSena Party (@JanaSenaParty) July 8, 2025