YS Sharmila Reddy: కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేపట్టిన ‘MGNREGA పరిరక్షణ యాత్ర’ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కడప టౌన్లోని యానాది కాలనీలో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నాయో వివరించారు.
ఉపాధి హామీ పథకంపై విమర్శలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1.10 కోట్ల జాబ్ కార్డులతో వెలుగు వెలిగిన ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన VB G – RAM G చట్టం గ్రామ స్వరాజ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గతంలో ఉపాధి హామీ అనేది ఒక ‘హక్కు’గా ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నాడు గాడ్సే గాంధీని భౌతికంగా చంపితే.. నేడు మోదీ పథకం పేరు మార్చి గాంధీ ఆశయాలను చంపుతున్నారని విమర్శిస్తూ ప్రధానిని ‘అభినవ గాడ్సే’గా అభివర్ణించారు.
కొత్త చట్టం – రాష్ట్రంపై భారం
పాత MGNREGA చట్టానికి.. ప్రస్తుత కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల విమర్శించారు. గతంలో గ్రామసభలకు ఉన్న పనుల నిర్ణయాధికారాన్ని కేంద్రం లాగేసుకుందని మండిపడ్డారు. పని గంటలను 6 నుండి 12 గంటలకు పెంచడం అమానుషమని.. ఎండల్లో అంతసేపు పని చేయడం సాధ్యం కాదని అన్నారు. కొత్త చట్టం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏటా రూ. 5 వేల కోట్ల అదనపు భారం పడుతుందని.. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం 40% నిధులు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.
రాజకీయ విమర్శలు
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల విమర్శించారు. వైసీపీ కూడా కూటమిలో భాగస్వామిలాగే వ్యవహరిస్తోందని.. విభజన హామీల సాధనలో ఈ ముగ్గురు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి హామీ పథకం పూర్వవైభవం సంతరించుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని ఆమె స్పష్టం చేశారు.