YS Sharmila: ఏపీలో కల్తీ పాల ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధితుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం, విపక్ష వైసీపీపై ఆమె నిప్పులు చెరిగారు.
కల్తీ పాల ఘటన వెనుక వరలక్ష్మి సంస్థతో పాటు ప్రభుత్వానిది కూడా నిర్లక్ష్యం ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు. చనిపోయిన 11 మందివి ప్రభుత్వం చేసిన హత్యలుగా ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత సీఎం చంద్రబాబు వహించాలని పట్టుబట్టారు. లైసెన్స్ లేకుండా 11 ఏళ్లుగా పాలు అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనిఖీలు చేయకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు మెుద్దు నిద్ర పోతున్నారా? అంటూ మండిపడ్డారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై కూడా షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. 11 మంది చనిపోతే జగన్ వచ్చి పరామర్శించకపోవడం దారుణమన్నారు. జగన్ తన సైతాన్ సైన్యాన్ని పరామర్శించడానికే తప్పా .. ప్రజలకోసం బయటకు రారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కి బలప్రదర్శనల మీదున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ది లేదని విమర్శించారు. వాళ్ల పార్టీ క్యాడర్ కి , సైతాన్ సైన్యంకి ఇబ్బంది వస్తే తప్పా జగన్ కాలు బయటపెట్టరని ఆరోపించారు. 11 ఏళ్లుగా అక్రమంగా డైరీ సంస్థ నడిపిన పాపంలో జగన్ హస్తం కూడా ఉంది కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Iran Israel War: ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్ – అమెరికా మధ్య చీలికలు.. కోపంతో ఊగిపోయిన ట్రంప్!
మరోవైపు రాష్ట్రంలో పాలు, నీళ్లు, కోడి గుడ్లు, చికెన్ ఇలా అన్ని రకాల కల్తీలు జరుగుతున్నా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని షర్మిల అన్నారు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరే ఉన్నారని.. ఆ లేడీ అధికారిణి అసలు సిటీలోనే ఉండరని షర్మిల ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే దిక్కు లేదు గానీ, సీఎం చంద్రబాబు ఏఐ గురించి చెబుతున్నారని మండిపడ్డారు. జనాభాను పెంచాలని, ముగ్గురు లేదా నలుగురిని కనమని చెబుతున్నారని విమర్శించారు.
Also Read: Anurag Crash: సూసైడ్ అటెంప్ట్ చేసిన యూట్యూబర్ అనురాగ్ డోభాల్ పరిస్థితి విషమం..